కొమురవెల్లి మల్లికార్జున స్వామికి సంబంధించి 25 మొక్కుబడి, ఆర్జిత సేవలు ఉండగా, ప్రస్తుతం ఆన్లైన్లో 12 రకాల సేవలు ఆలయవర్గాలు అందుబాటులోకి తెచ్చాయి. స్వామివారికి అభిషేకం, చెలుక పట్నం, కుంకుమార్చన, ముఖమండప పట్నం, నజరుపట్నం, శాశ్వత కల్యాణం, శాశ్వత పూజ, స్వామివారి నిత్య కల్యాణం, తిరుగుడ కోడె, వీవీఐపీ దర్శనం, ఎల్లమ్మ అర్చన, ఎల్లమ్మ పట్నం సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భక్తులు టీ-యాప్ పోలియోలో సులువుగా సేవలు బుక్ చేసుకుని నేరుగా ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చు. అవగాహన లేక కొంతమంది భక్తులు మాత్రమే ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారు. స్వామివారి ఆర్జిత సేవలు, మొక్కుబడుల సేవలే కాకుండా కాటేజీలు, ప్రసాదాలు విక్రయ టికెట్లు తదితర సేవలను సైతం అందుబాటులోకి తీసుకురావాలని ఆలయవర్గాలు యోచిస్తున్నట్లు ఈవో బాలాజీ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.