మెదక్, సెప్టెంబర్ 27 : భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు. జిల్లాలోని లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా జిల్లా రెవెన్యూ, పంచాయతీరాజ్, నీటి పారుదల, మున్సిపల్ కమిషనర్లు, మండల అధికారులకు ఆదేశాలిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినా తక్షణమే స్పందించేందుకు అధికారులు హెడ్ క్వార్టర్లోనే ఉండాలన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలు, తీసుకోవాల్సిన చర్యలపై మండలాల వారీగా ఆయా సంబంధిత శాఖ వారు పోలీస్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఇందులో రెండు షిప్టుల్లో 24 గంటలు పని చేసే విధంగా రెవెన్యూ సిబ్బంది ఉంటారని వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుంచి మరుసటి ఉదయం 8 గంటల వరకు పనిచేస్తారని తెలిపారు. ఇక్కడకు వచ్చిన ఫోన్ కాల్స్ సమాచారాన్ని సిబ్బంది తక్షణమే సంబంధిత ఆర్డీవోలు, తహసీల్థార్లకు తెలియజేసి అప్రమత్తం చేస్తారని, వెంటనే సహాయ కార్యక్రమాలు చేపడుతారని కలెక్టర్ తెలిపారు. కంట్రోల్ రూంలోని 08452-223360 లేదా 7995088720 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ముంచెత్తిన వాన
గులాబ్ తుఫాన్ ప్రభావంతో సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నిటిని దిగవకు వదులుతున్నారు. నల్లవాగు, నారింజ ప్రాజెక్టు వరదతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో 1.4 సెం.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుమ్మడిదలలో అత్యధికంగా 2.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. 11మండలాల్లో 59శాతం అధి క వర్షపాతం నమోదు కాగా, 14 మండలా ల్లో 19శాతం అధిక వర్షం కురిసింది. కంగ్టి మండలంలో 2.7 సెం.మీ, అమీన్పూర్లో 2.6, మునిపల్లిలో 2.4, రాయికోడ్లో 2.1 సెం.మీ, రామచంద్రాపురం, పటాన్చెరు, జిన్నారం, అందోల్, నాగల్గిద్ద, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో 1 నుంచి 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. అక్కడక్కడా పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ అధికారులు పంటనష్టం వివరాలను సేకరిస్తున్నారని సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహ్మారావు తెలిపారు. తుఫాన్ కారణం గా రాబోయే రెండు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు మున్సిపల్, పంచాయతీ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సహాయం అందజేసేందుకు సంగారెడ్డి కలెక్టరేట్లో హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. వర్షాలతో ఎవరైనా ఇబ్బందులు పడితే హెల్ప్లైన్ నంబర్ : 08455-72233కు సమచారం సంప్రదించాలని తెలిపారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీర..
సింగూరు ప్రాజెక్టులోకి సోమవారం 37, 782 క్యూసెక్కుల వరద రాగా, మూడు గేట్లు ఎత్తివేసి దిగవకు 35,190 క్యూసెక్కుల వర ద వదిలారు. దీంతో సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీర రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. మంజీర రిజర్వాయర్ ఐదుగేట్లు ఎత్తి దిగవకు నీటిని వదులుతున్నారు. నల్లవాగు ప్రాజెక్టు, జహీరాబాద్లోని నారింజ ప్రాజెక్టు, మల్కాపూర్ పెద్దచెరువు అలుగు పారుతుంది. దీంతో గ్రా మస్తులు గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. సదాశివపేట మండలంలోని గంగకత్వ వాగు, సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్సాగర్ చెరువు అలుగు పారుతుంది. అందోల్లోని అన్నసాగర్, అందోల్ పెద్ద చెరువు, అమీన్పూర్ చెరువు నిండుకున్నా యి. జిల్లాలో మొత్తం 3140 చెరువులు ఉం డగా, 610 చెరువులు అలుగు పారుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో 147 చెరువులు, జహీరాబాద్ సర్కిల్ పరిధిలో 43, నారాయణఖేడ్ పరిధిలో 355 చెరువులు, దౌల్తాబాద్ సర్కిల్ పరిధిలో 65 చెరువులు అలుగు పారుతున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని 1302 చెరవులు నిండుకుండులా మారాయి.
మెదక్ జిల్లాలో ముసురు వాన..
జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తన్నాయి. ముసురుతో రైతుల్లో ఆనందం నెలకొంది. జిల్లాలోని ప్రాజెక్టులు నీటిమట్టం పూర్తిస్థాయి నిల్వలకు చేరుతోంది. మరోవైపు జిల్లాలో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్కడకక్కడ చిరుజల్లులు కురుస్తుండగా, వరి పొలాల్లోకి నీరు చేరుతోంది. తూప్రాన్, కొల్చారం, నార్సింగి, రామాయంపేట, హవేళీఘనపూర్, రేగోడ్లలో మోస్తారు వర్షం కురిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం 16.13 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తూప్రాన్లో 34.9మి.మీ, కొల్చారంలో 29.0మి.మీ, నార్సింగి 24.0మి.మీ, రామాయంపేటలో 34. 5మి.మీ, హవేళీఘనపూర్లో 25.2 మి.మీ, రేగోడ్లో 22.6మి.మీ, నిజాంపేటలో 19.3మి.మీ, మాసాయిపేట లో 10.8మి.మీ వర్షపాతం నమోదైంది.
సిద్దిపేట జిల్లాలో ..
సిద్దిపేట, సెప్టెంబర్ 27 : బంగాళఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్తో సోమవారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా హుస్నాబాద్లో 2.46 సె.మీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా చూస్తే దుబ్బాకలో 0.53 సె.మీ, సిద్దిపేట రూరల్లో 2.20 సె.మీ, చిన్నకోడూరులో 0.38 సె.మీ, బెజ్జంకిలో 0.22 సె.మీ, అక్కన్నపేటలో 2.01 సె.మీ, నంగునూరులో 0.82 సె.మీ, సిద్దిపేట అర్బన్లో 1.0 సె.మీ, తొగుటలో 0.57 సె.మీ, మిరుదొడ్డిలో 0.11 సె.మీ, దౌల్తాబాద్లో 0.39 సె.మీ, రాయిపోల్లో 0.87 సె.మీ, వర్గల్లో 1.19 సె.మీ, ములుగులో 0.99 సె.మీ, మర్కూక్లో 1.85 సె.మీ, జగదేవ్పూర్లో 0.82 సె.మీ, గజ్వేల్లో 1.31 సె.మీ, కొండపాకలో 0.92 సె.మీ, కొమురవెల్లిలో 0.73 సె.మీ, చేర్యాలలో 0.90 సె.మీ, మద్దూరులో 1.30 సె.మీ, నారాయణరావుపేటలో 1.53 సె.మీ, ధూళిమిట్టలో 0.98 సె.మీ వర్షపాతం నమోదైంది.
నిలిచిన రాకపోకలు
ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో మండలంలోని రేజింతల్-ఎల్గోయి, చీకూర్తి-చాల్కి గ్రామాల మధ్య రాకపోకలు సోమవారం రాత్రి నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా రోడ్డు మార్గాల్లోని కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. రేజింతల్ సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రేజింతల్-ఎల్గోయి గ్రామాల మధ్య రాకపోకలు సాగకుండా ముందుస్తు చర్యగా భారికెడ్లను ఏర్పాటు చేయించారు. చీకూర్తి-చాల్కి గ్రామాల మధ్య ఉన్న కల్వర్టుపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బీదర్, నారాయణఖేడ్, హుస్సేన్నగర్ తదితర ప్రాంతాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గడంతో తిరిగి రాత్రి 9 గంటల ప్రాంతంలో వాహనాల రాకపోకలు తిరిగి కొనసాగాయి.
అలర్ట్గా ఉండండి
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిలాల్ల యంత్రాంగాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రి జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, సీపీ, ఎస్సీలు క్షేత్రస్థాయిలో గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు స్థానికంగా ఉండాలన్నారు. చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల నీటి మట్టాలు పర్యవేక్షిస్తూ, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. తెగడానికి అవకాశమున్న చెరువులపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, శిథిలావస్థ భవనాల్లో ఉండే ప్రజలను ఖాళీ చేయించి, తాత్కాలిక వసతి కల్పించాలని ఆదేశించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, మనుషులు అటువైపు వెళ్లకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలపై కంట్రోల్ రూంకు వచ్చే సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. పూర్తిగా ఇండ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక సహాయం వెంటనే అందేలా చూడాలని చెప్పారు. బాధితులకు రేషన్ బియ్యం అందజేయాలని చెప్పారు.