మెదక్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రామాయంపేట్, మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రమేశ్, ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ముందుగా ఔరంగాబాద్లో నూతన ఎస్పీ కార్యాలయ భవనాన్ని సందర్శించి, పనులు త్వరితగతిన చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. ఆ తర్వాత నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించి మిగిలిపోయిన పనులను వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రధాన దవాఖానలో రేడియాలజీ ల్యాబ్ను పరిశీలించారు. జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చివరగా సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో పంచాయత్ సతత్ వికాస్ పురసార్ ప్రదానోత్సవ ఏర్పాట్లు పరిశీలించి, ఏర్పాట్లు చేయాలని డీపీవో సాయిబాబాకు సూచించారు. అంతకుముందు రామాయంపేటలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించారు. లబ్ధిదారులకు అందించనున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి ఆవరణ అంతా రోడ్ రోలర్తో చదును చేసి దుమ్ము లేవకుండా నీళ్లు చల్లాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చందూనాయక్, పీఆర్ ఈఈ సత్యనారాయణరెడ్డి, జడ్పీ సీఈవో శైలేశ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్సాగర్ తదితరులు ఉన్నారు.
అర్హులైనవారినే రెండు పడకల గదులకు ఎంపిక చేసి డ్రా లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రామాయంపేటకు విచ్చేసిన కలెక్టర్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్న రెండు పడకల గదులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తనను కలిసిన నిరుపేదలతో కలెక్టర్ మాట్లాడారు. మరికొన్ని ఇండ్లు ఉన్నాయని, ప్రస్తుతం పట్టాలు పొందనున్నవారిలో ఎవరైనా ఇల్లు కలిగి ఉంటే వారి పేర్లు ఇవ్వాలని, వారికి క్యాన్సిల్ చేసి అర్హులకు కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ రమేశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ మన్నన్, ఎంపీడీవో ఉమాదేవి, ఆర్ఐ రాజు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, చిలుక గంగాధర్, చంద్రపు కొండల్రెడ్డి, బొర్ర అనిల్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు బుధవారం మెదక్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు రామాయంపేటలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేయనున్నారని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు హవేళీఘనపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 2:30 గంటలకు మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చిన్నశంకరంపేట మండలం టి.మాందాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ధరణి పాస్ బుక్స్ అందజేయనున్నారని తెలిపారు. 3:00 నూతన కలెక్టర్ కార్యాలయం పనులను పరిశీలించి ఆర్అండ్బీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. 3:30 గంటలకు మెదక్ పట్టణంలో జిల్లాస్థాయిలో ఎంపికైన 27 గ్రామ పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులను అందజేయనున్నాని తెలిపారు. సాయంత్రం 5:00 గంటలకు మెదక్ జిల్లా దవాఖానలో రేడియాలజీ ల్యాబ్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 5:30 గంటలకు టీఎన్జీవో భవన్లో కమ్యూనిటీ సంఘాలకు ప్రొసీడింగ్స్ అందజేస్తారని తెలిపారు. 6:30 గంటలకు మెదక్ షాదీఖానలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారని పేర్కొన్నారు.