చేర్యాల, మార్చి 4: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గననీయంగా ఆదాయం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో మల్లన్న క్షేత్రాభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆలయ అధికారులు, పాలక మండలి, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది సైతం భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల ఆదరణతో రోజురోజుకూ కోరమీసాల మల్లన్నస్వామికి కాసుల వర్షం కురుస్తున్నది. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు, హుండీ ద్వారా ఆదాయం స్వామివారి ఖజానాకు సమకూరుతున్నది. దీంతో భక్తులకు మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. గతంలో భక్తులు కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. ప్రస్తుతం సంవత్సరం పాటు ప్రతి ఆదివారం, బుధవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఇటు బ్రహ్మోత్సవాల సమయంతో పాటు మిగిలిన రోజుల్లో మల్లన్న స్వామి ఆదాయం పెరుగుతున్నది. డిసెంబర్ 18, 2022న మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు హుండీ, ఆర్జిత సేవల ద్వారా రూ.6,15,84,613 ఆదాయం సమకూరింది. అందులో ఆరు ఆదివారాల్లో రూ. 2,99,24,070 ఆదాయం వచ్చింది. స్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయం ద్వారా అందించే ఆర్జిత సేవల (గదులు, ప్రసాదాల కొనుగోలు, కల్యాణోత్సవ నిర్వహణ మొక్కులు, ముఖమండపం, నజరు, చిలుక పట్నం, తలనీలాల సమర్పణ, అభిషేకం, పట్నం) ద్వారా ఆదాయం వచ్చింది. హుండీ లెక్కింపు ద్వారా రూ.3,16,60,543 ఆదాయం లభించింది.
రోజురోజుకు పెరుగుతున్న ఆదాయం
స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంలోని పట్నం వారం ఆదాయం రూ.49,83,819, లష్కర్ వారం రూ.38,78,220, మూడో ఆదివారం రూ.37,99,740, నాలుగో ఆదివారం రూ.48,48,479, ఐదో ఆదివారం రూ.58,12,059, ఆరో ఆదివారం రూ.66,01,753 ఆదాయం వచ్చింది. ఆరువారాల్లో స్వామి వారి ఖజానాకు రూ.2,99,24,070 ఆదాయం సమకూరింది. స్వామివారి ఆర్జిత సేవలు, హుండీల ద్వారా ఇప్పటి వరకు రూ.6,15,84,613 ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. మరో మూడు ఆదివారాల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగనుండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.
రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
స్వామి వారి కల్యాణోత్సవంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ వర్గాలు ఆలయంలోని హుండీలను మూడుసార్లు లెక్కించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడుసార్లు లెక్కింపులు జరిపితే ఆదాయం కోటి దాటడం గమనార్హం. స్వామి వారి ఆలయ చరిత్రలో 20 రోజుల్లో కోటి ఆదాయం వచ్చింది. కోరమీసాల స్వామి కల్యాణోత్సవం నుంచి మూడుసార్లు హుండీల లెక్కింపులు జరిపారు. జనవరి 10న హుండీ లెక్కింపులో రూ.1,02,93,399, ఫిబ్రవరి 9వ తేదీ లెక్కింపులో రూ.1,08,62,138, మార్చి 2న జరిపిన లెక్కింపులో రూ. 1,05,05,006 ఆదాయం వచ్చింది. మూడుసార్లు జరిగిన హుండీ లెక్కింపుల ద్వారా రూ.3,16,60,543 ఆదా యం సమకూరింది.
భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం
మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి మల్లన్న క్షేత్రంలో విధులు నిర్వహిస్తున్నది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నుంచి కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. దీంతో భక్తులు సకాలంలో దర్శనం చేసుకుంటున్నారు.స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. భక్తులు సంతోషంగా హుండీల్లో కానుకలు సమర్పించడంతో పాటు మొక్కులు చెల్లించుకోవడంతో ఆదాయం పెరుగుతున్నది.
– గీస భిక్షపతి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్
చేర్యాల, మార్చి 4: కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఏడో ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తదితర పూర్వపు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. కొమురవెల్లి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తులు మల్లన్నకు బోనం సమర్పించి పట్నం వేసి మొక్కులు చెల్లించుకోనున్నారు. మరికొందరు భక్తులు మల్లన్నను దర్శనం చేసుకొని, మల్లన్న గుట్టపైన ఎల్లమ్మకు బోనం చేసి మొక్కులు తీర్చుకోనున్నారు. మల్లన్న క్షేత్రంలో మొక్కుల అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు తరలివెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనాలు సమర్పించనున్నారు. స్వామి వారి క్షేత్రానికి తరలివచ్చే భక్తుల కోసం ఆలయ పాలక మండలి, ఆలయ సిబ్బంది సేవలందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు కల్పిస్తున్నామని మల్లన్న ఆలయ ఈవో ఎ.బాలాజీ, పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి తెలిపారు. ఇప్పటికే ఐదు ఆదివారాలు ముగిశాయని, మిగిలిన వారాలకు భక్తులు భారీగా తరలిరానుండడంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆదాయం మరింత పెరిగే అవకాశం
స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజురోజుకూ ఆదాయం పెరుగుతున్నది. రానున్న రోజుల్లో మరింత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి, ఏఈవోలు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు కృషి చేస్తున్నారు. దీంతో ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. సకాలంలో అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు మరిన్ని వసతులు కల్పించడమే లక్ష్యం. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మల్లన్న క్షేత్రంలో సేవలు అందిస్తున్నాం.
– ఆలూరి బాలాజీ, ఆలయ ఈవో