మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 21: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందరెడ్డి అన్నారు. మంగళవారం వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న మెప్మా మహిళలు ఇంటింటీ సర్వే చేస్తుండగా, వారిని సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి ఇండ్లకు ఎల్లో స్టిక్కర్, వేసుకోని వారి ఇళ్లకు రెడ్ స్టిక్కర్ అంటిస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో ప్రతి వార్డులో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బోద్దుల కృష, గట్టేశ్ పాల్గొన్నారు.
కొవిడ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
మనోహరాబాద్, సెప్టెంబర్ 21 : మెదక్ను కొవిడ్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో నిర్వహించిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం జడ్పీ నిధులతో గ్రామంలో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించి, ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీడీవో జైపాల్రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, నాయకులు నాగరాజు, ఆనంద్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాట్రియాలలో..
రామాయంపేట, సెప్టెంబర్ 21: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో కరోనా టీకా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మైలారం శ్యాములు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సుజాత, ఆశవర్కర్లు, ఉపసర్పంచ్ స్రవంతి, వార్డు సభ్యులు, వెలుగు సీఏలు తదితరులు పాల్గొన్నారు.
పోతంశెట్పల్లిలో 170 మందికి టీకా
కొల్చారం, సెప్టెంబర్ 21: మండల పరిధిలోని పోతంశెట్పల్లిలో మంగళవారం కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించి 170 మందికి టీకా వేశారు. సర్పంచ్ నాగరాణి , ఎంపీటీసీ భాగ్యలక్ష్మి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఏఎన్ఎం జ్యోతి, పంచాయతి కార్యదర్శి అరుంధతి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
టీకా కేంద్రం పరిశీలన
మెదక్రూరల్, సెప్టెంబర్ 21: మెదక్ మండలంలోని రాయిన్పల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని సర్పంచ్ సిద్దగౌడ్, ఎంపీటీసీ శ్రీహరి పరిశీలించారు. అనంతరం కొవిడ్ రెండో డోస్ టీకాను వేయించుకున్నారు. పంచాయతీ కార్యదర్శి నవనీత, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి
చిన్నశంకరంపేట, సెప్టెంబర్21: పాఠశాలలో విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాలని ఎంపీపీ భాగ్యలక్ష్మి సూచించారు. మంగళవారం ఆమె జంగరాయి గిరిజన తండాలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఎంపీడీవో గణేశ్రెడ్డి, ఎంపీవో గిరిధర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట, సెప్టెంబర్21: మండల పరిధిలోని కామారంలో మండల సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరియాదవ్ కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, వైద్యసిబ్బంది. గ్రామస్థులు పాల్గొన్నారు.
పాపన్నపేట మండల పరిధిలో..
పాపన్నపేట, సెప్టెంబర్21: పాపన్నపేట మండల పరిధిలోని గాజులగూడెం, చిత్రియాల, బాచారం, మల్లంపేట, నర్సింగరావుపల్లితండా, నామాపూర్ తదితర గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచ్వో చందర్, వైద్య సిబ్బంది దుర్గయ్య, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.