పారిశ్రామిక పంచాయతీ గడ్డపోతారం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ఒకప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన గ్రామం. ఇప్పుడు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వ సహకారంతో పాటు అధికారులు,ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమష్టి కృషితో గ్రామంలో అన్ని వసతులు సమకూరాయి. దశాబ్దాల సమస్యకు వైకుంఠధామంతో పరిష్కారం లభించింది.
పల్లె ప్రకృతివనాలు డంపింగ్యార్డు, నర్సరీలు ఏర్పాటయ్యాయి. పరిశుభ్రంగా కనిపిస్తున్న వీధుల్లో.. సీసీరోడ్లకు ఇరువైపులా పచ్చదనం ఉట్టిపడుతున్నది.
జిన్నారం, జూలై 19:రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లెప్రగతి’ కార్యక్రమంతో గ్రామం ప్రగతి వైపు పరుగులు తీస్తున్నది. దాదాపు నాలుగువేల జనాభా ఉన్న పంచాయతీలో గడ్డపోతారం, చెట్లపోతారం, కిష్టయ్యపల్లి, అల్లీనగర్, ప్రశాంత్నగర్, తెలంగాణతల్లి కాలనీ, దాచారం దార్గుల్లా పునరావాస కాలనీలు ఉన్నాయి. పార్కు, డంపింగ్యార్డు, వైకుంఠధామం, నర్సరీల ఏర్పాటుతో గ్రామం అందంగా ముస్తాబైంది. అందమైన పల్లెప్రకృతి వనం, పిల్లలు ఆడుకునేందుకు చిల్డ్రన్ పార్కు, ప్రొఫెసర్ జయశంకర్సార్ విగ్రహం, 60ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా గ్రామానికిప్రత్యేక అలంకరణగా నిలిచాయి. కిష్టయ్యపల్లిలో గంధం పార్కు, గడ్డపోతారం, కిష్టయ్యపల్లి, అల్లీనగర్ గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు, డంపింగ్యార్డు, నర్సరీ, వైకుంఠధామ నిర్మాణాలను పూర్తి చేశారు.
కోట్ల రూపాయలతో అభివృద్ధి..
గ్రామ పంచాయతీలో 2019 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.8కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. ఇందులో గ్రామ పంచాయతీ నిధులు రూ.6.50కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.43కోట్లు, కేంద్ర నిధులు రూ.69కోట్లు ఉన్నాయి. ఇవే కాకుండా సీఎస్ఆర్, ఎమ్మెల్యే నిధుల నుంచి చేపట్టిన అభివృద్ధి పనులు అదనం. పంచాయతీలోని అన్ని అంతర్గత రోడ్లు సీసీతో నిర్మించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు.
పంచాయతీలోని పారిశ్రామిక వాడలో సీసీరోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులు, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో దాదాపు రూ.కోటితో సీసీరోడ్ల నిర్మాణాలను చేపట్టారు. పారిశ్రామిక వాడకు వెళ్లేందుకు అయ్యమ్మ చెరువు కట్టపై రెండు వరుసల సీసీరోడ్డును ఏర్పాటు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల్లోని ఖాళీ స్థలాల్లో వేల సంఖ్యల్లో మొక్కలు నాటారు. అన్ని ప్రాంతాలు, పలు రాష్ర్టాల ప్రజలు నివాసం ఉండే గడ్డపోతారం పంచాయతీ సెమీ అర్బన్గా మారింది. గడ్డపోతారం గ్రామ పంచాయతీ రెవెన్యూ మేడ్చల్ జిల్లాకు సంగారెడ్డి జిల్లాకు బార్డర్లో ఉంది.
గ్రామ వివరాలు..
పంచాయతీలో గడ్డపోతారం, చెట్లపోతారం, కిష్టయ్యపల్లి మూడు రెవెన్యూ గ్రామాలు ఉండగా.. అల్లీనగర్, దాచారం దార్గుల్లా పునరావాస కాలనీ, ప్రశాంత్నగర్, తెలంగాణ తల్లీ కాలనీలు ఉన్నాయి. పంచాయతీ మొత్తం జనాభా 3,685 మంది ఉండగా.. మొత్తం 1050 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 1,885 మంది, మహిళలు 1800 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2202 మంది ఉండగా.. ఇందులో పురుషులు 1115 మంది, మహిళలు 1087 మంది ఉన్నారు.
అందరి సహకారంతో గ్రామాభివృద్ధి..
పంచాయతీలోని అన్ని గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కృషి చేశారు. పల్లెప్రగతి కార్యక్రమంతో మా గ్రామ రూపురేఖలే మారిపోయాయి. రసాయన పరిశ్రమలు ఉన్న పంచాయతీ కావడంతో వాటి నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విరివిగా మొక్కలు నాటుతున్నాం. గడ్డపోతారంలో సంవత్సరాలుగా వైకుంఠధామం లేక చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ, పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామంతో పాటు మూడు గ్రామాల్లో డంపింగ్ యార్డులు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేసుకున్నాం.