మెదక్ రూరల్/రామాయంపేట/ న్యాల్కల్, ఆక్టోబర్ 29 : రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు కమ్మేస్తున్నది. వారం రోజులుగా పొగ మంచు మూలం గా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలైనా చలి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ఇంటిల్లిపాది దుప్పట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇండ్ల పైట్యాంకుల్లో నీళ్లు ఐస్ను తలపిస్తున్నాయి. పగటిపూట సూర్యుడు మండుతున్నా ప్రజలు నీడకు రావడం లేదు. చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఉదయం 9గంటలకు కూడా చలి తగ్గకపోవడంతో పాఠశాలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విధుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ఉద్యోగులు, మార్నింగ్ వాకింగ్ చేసేవారు, రైతులు, కూలీలు, కార్మికులు, వ్యాపారులు గరం కోట్లు ధరించకుండా బయటికి రావడం లేదు. పాలు, కూరగాయల వ్యాపారులు, పేపర్ బాయ్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చలి నేస్తాలుగా పేరున్న ఉన్ని వస్ర్తాలకు గిరాకీ పెరిగింది.
ఉపశమనం పొందండిలా..
ప్రయాణికులు, ఇంటి నుంచి పనుల కోసం బయటకు వెళ్లే వారు తప్పని సరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా ఐదేండ్లలోపు పిల్లలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారు, శ్వాసకోస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం వేళలో వాకింగ్ చేయకపోవడం మంచిది. ఒకవేళ వెళ్లాల్సి వస్తే శరీరమంతా కప్పేలా ఉన్ని వస్ర్తాలు ధరించాలి. చెవి, ముక్కు, నోటి నుంచి గాలి లోపలికి వెళ్లకుండా మఫ్లర్ వాడాలి. ఇంట్లో ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి. ఎప్పుడు స్నానం చేసినా గోరువెచ్చని నీటినే ఉపయోగించాలి. చర్మం పొడిబారకుండా తేమను పెంచే క్రీములు వాడాలి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు బయటికి వెళ్లకూడదు. తీవ్రమైన చలితో చేతులు పట్టు తప్పుతాయి. అందువల్ల అత్యవసరమైతే తప్ప రాత్రిళ్లు, తెల్లవారు జామున వాహనాలు నడుపకపోవడమే మంచిది. సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చేతులు, కాళ్లు వంకర్లు పోతున్నాయి..
తీవ్రంగా ఉన్న చలి మూలంగా వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఒకవేళ పనులకు పోయినా అక్కడ కొద్దిసేపు మంటలు కాచుకునే పనిలోకి వెళ్తున్నాం.చలిబాగా ఉండడంతో వ్యవసాయ పనులు సరిగ్గా సాగడంలేదు. కూలీలు కూడా దొరకక పోవడంతో సొంతంగానే వ్యవసాయ పనులను చేసుకుంటున్నాం.ప్రతిరోజు నీల్లలోనే ఉండడంతో చేతులు కాళ్ల వంకర్లు పోతున్నాయి.
-ఎడ్ల మల్లారెడ్డి, రైతు నందిగామ
జాగ్రత్తలు పాటించాలి..
చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు చలి అధికంగా ఉన్నప్పుడు ఇండ్లలోనే ఉండాలి. చలికాలంలో జలు బు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు అధికంగా రావడానికి అవకావశం ఉంటుంది. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు వైద్యుల సలహాలు, సూచనలు తప్పక పాటించాలి.
-చంద్రశేఖర్, చిన్న పిల్లల ప్రభుత్వ దవాఖాన వైద్యుడు (మెదక్)
పొద్దంతా ఎండలోనే ఉంటున్నాం..
చలిమూలంగా పొద్దంతా ఎండలోనే ఉంటున్నం. పొద్దుగల్లనే జీవాలను తీసుకొని అడివిలోనే ఉండే మాకు మంచుతో తీవ్ర ఇబ్బందులు పడ్తున్నం. పదిదాటినా మంచు కురుస్తూనే ఉంటున్నది. మేము అన్నం తిన్నా నీల్లుతాగినా మాకు ఎండతోనే పొద్దుగడుస్తుంది.
-గొర్లకాపర్లు కిష్టయ్య,యాదగిరి (రాయిలాపూర్)