పాపన్నపేట, జూలై 25 : ఏడుపాయల వనదుర్గామాత ఆదివారం పుష్పాంబరి రూపంలో దర్శనమిచ్చింది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో వైభవంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, బోనాలు, కుంకుమార్చనలు, తలనీలాలు సమర్చించారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ ఈవో సార శ్రీనివాస్ తగిన చర్యలు చేపట్టగా, వేదపండితులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు.
మల్లన్నకు భక్తుల పూజలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం మమ్మేలు స్వామి అంటూ మార్మోగింది. భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని గంగరేగి చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజ య్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
కిటకిటలాడిన మెదక్ చర్చి
మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ప్రేమ్ సుకుమార్ దైవసందేశం చేశారు. ప్రతిఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. రోలాండ్పాల్ ఆధ్వర్యంలో ఏసయ్య భక్తి గీతాలు ఆలపించారు. భక్తులు చర్చి ఆవరణలో చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు. ప్రార్థనల్లో పాస్టర్లు దయానంద్, రాజశేఖర్, జైపాల్, అనుగ్రహతో పాటు చర్చి కమిటీ సభ్యులు జయరాజ్, జాయ్ముర్రే గెలెన్, రోలాండ్పాల్, శాంతికుమార్, సువన్డగ్లస్, ఉదయ్కిరణ్ పాల్గొన్నారు.