మెదక్, జూలై 14 : వ్యాపార అభివృద్ధికి దరఖాస్తు చేసుకు న్న వీధివ్యాపారులందరికీ వారం రోజుల్లో రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందజేయాలని బ్యాంకర్లకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. ప్రధానమంత్రి హామీతో చేపట్టిన ఈ పథకంలో లబ్ధిదారులు పలుసార్లు బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణాలు మంజూరు చేయకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాలులో జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించి, వివిధ బ్యాంకుల నియంత్రణ అధికారులతో మాట్లాడారు. వీధి వ్యాపారాల కోసం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో 6,300 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని, భౌతిక దరఖాస్తు లేదు అనే కారణాన్ని చూపకుండా పెండింగ్లో ఉన్న 1,779 మంది లబ్ధిదారులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన యూనిట్లను గ్రౌండింగ్ చేయడంలో ఆసక్తి చూపడం లేదని, అలా అయితే డిపాజిట్లు ఉపసంహరించుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వివిధ పథకాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆమోదమో లేదా తిరస్కరించడమో చేయాలని, పెండింగ్ లో పెట్టరాదని సూచించారు. బ్యాంకర్లు తమ పనితీరును మెరుగుపర్చుకొని నాబార్డు, ఆర్బీఐ మార్గదర్శకాలకనుగుణంగా రైతులకు రుణాలు అందించాలని కోరారు.
రూ.822 కోట్ల్లు పంట రుణాలుగా ఇచ్చాం..
గతేడాది రూ.822 కోట్లను పంట రుణాలు, రూ.1,063 కోట్లను అగ్రి గోల్డ్ రుణాలు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో రూ.90.25కోట్లను టర్మ్లోన్లుగా ఇచ్చా మని వివరించారు. రైతుల బకాయి రుణాలను మండలాల వారీగా జిల్లా వ్యవసాయాధికారికి ఇస్తే రికవరీకి చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. డీఆర్డీఏ కార్యక్రమాన్ని సమీక్షిస్తూ గతేడాది బ్యాంక్ లింకేజీగా రూ.347 కోట్లు ఇచ్చి, వందశాతం లక్ష్యాన్ని సాధించామని, ఈ యేడాది రూ. 387 కోట్ల లక్ష్యానికి రూ.39 కోట్లు అందించామని, ఇప్పటి నుంచే లక్ష్య సాధనకు బ్యాంకర్లు ప్రయత్నించాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 3048 డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష చొప్పున రుణాలు అందించాలని బ్యాంకర్లను కోరారు. ఏపీజీవీబీ బ్యాంకుపై ఫిర్యాదులు వస్తున్నాయని, పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. పరిశ్రమల కేంద్రం ద్వారా గతే డాది 60 దరఖాస్తులు వస్తే, 15 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించి సబ్సిడీ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు లేకపోవడంతో 2017-18లో 15 యూనిట్లు, 2018-19లో 120 యూనిట్లు పెండింగ్లో ఉన్నాయని, అదే విధంగా ఎస్టీకి సంబంధించి 2017-18లో 61 యూనిట్లు గ్రౌండ్ కాలేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో 50 వెజిటబుల్ పాండాస్ యూనిట్లు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పరిశీలించాలని సూచించారు. ఎస్బీఐ అధికారులు వృత్తి నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తున్నారని, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మెదక్లో శిక్షణ ఇప్పించాలని తెలిపారు. సమావేశం లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, నాబార్డు డీడీఎంలు సెసిల్ తిమోతి, వీకే తేజ, ఆర్బీఐ ఎల్డీవోలు రాజేంద్రప్రసాద్, శివరామన్, లీడ్ బ్యాంక్ అధికారి వేణుగోపాల్రావు, డీఏవో పరశురాంనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, బీసీ సంక్షేమాధికారి జగదీశ్, డీటీడబ్ల్యూవో ఫిరంగి, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, డీఆర్డీఏ పీడీ బీమయ్య పాల్గొన్నారు.