పేదలకు కార్పొరేట్ విద్యనందించడమే లక్ష్యం..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, మే 18: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యమిస్తున్నదని, పేదలకు కార్పొరేట్ తరహా విద్యనందించడమే లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో రూ.5లక్షల జడ్పీనిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గది నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారని చెప్పారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి ఉచిత భోజన వసతితో పాటు అత్యున్నత విద్యాప్రమాణాలను అందించానని చెప్పారు. ఈ ఏడాది రూ.2వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. కరోనా ఉధృతిని తగ్గించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ విధించారని, దీనికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అవసరమైన మందులు, ఆక్సిజన్ను అందించకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని దవాఖానల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. మరో ఆరు జిల్లాల్లో నూతనంగా మెడికల్ కళాశాలలు, ప్రతి ప్రభుత్వ దవాఖానలోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీ నల్లా వనిత, సర్పంచ్ దొగ్గలి ప్రమీల, ఉపసర్పంచ్ మహేందర్ యాదవ్,ఎంఈవో జయశీల, కౌన్సిలర్ భరత్ కు మార్, నాయకులు నల్లా రాజేశ్వర్, చందాల రాజన్న, రామ్కుమార్,రాజు, కిరణ్, యోగేశ్ పాల్గొన్నారు.
షెడ్ల నిర్మాణాలను నిలిపివేయాలి
ఆదిలాబాద్ రూరల్, మే 18: పట్టణంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం చుట్టూ చేపట్టనున్న షెడ్ల నిర్మాణాలను వెంటనే ఆపేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో మంగళవారం ఆయన మాట్లాడారు. షెడ్ల నిర్మాణాల స్థలాన్ని పరిశీలించారు. కళాశాల ముందున్న ప్రాంతాన్ని పార్కులాగా సుందరంగా తీర్చిదిద్దాలని, అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, టీఆర్ఎస్ నాయకుడు జోగు మహేందర్, కళాశాల సిబ్బంది అనిత పాల్గొన్నారు.