31లోగా విశ్రాంత ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరాలి
43,899 మందికి ప్రయోజనం
సర్వత్రా హర్షాతిరేకాలు
సీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్కు కృతజ్ఞతలు
శ్రీరాంపూర్, ఆగస్టు 12: సింగరేణిలో ఉద్యోగ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన ఇటీవల జరిగిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆమోదం తెలుపగా, ఇందుకు సంబంధించిన విధి విధానాలతో కూడిన సర్క్యులర్ను డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) బలరాం వెలువరించారు. ఈ ఏడాది మార్చి తర్వాత రిటైర్డ్ అయిన వారంతా ఈ నెల 31లోగా తిరిగి విధుల్లో చేరాలని స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తంగా 43,899 వేల మందికి ప్రయోజనం చేకూరనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థ సీ అండ్ఎండీ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఉద్యోగుల విరమణ వయసును 61 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించిన విధివిధానాలతో కూడిన ఉత్తర్వులను డైరెక్టర్(పర్సనల్, పైనాన్స్) ఎన్ బలరాం విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఉద్యోగ విరమణ పొం దిన ప్రతి కార్మికుడు, అధికారి తిరిగి విధుల్లో చేరడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 31 లోగా విధుల్లో చేరాలని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ఉద్యోగాల్లో చేరని పక్షంలో తిరిగి విధు ల్లో చేరే అవకాశం ఉండదని తెలిపారు. విరమణ పొందిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే అవకాశం ఉండదని వివరించారు. ఉద్యోగ విరమణ పొం దిన తేదీ నుంచి తిరిగి విధుల్లో చేరే తేదీ మధ్య కాలాన్ని ‘నో వర్క్-నో పే, గా పరిగణిస్తారు. ఆ కాలాన్ని కంపెనీ సర్వీసుగానే గుర్తిస్తారు. విరమణ పొంది తిరిగి విధుల్లో చేరే వారి పింఛన్ గుర్తించడం జరుగుతుంది. విధుల్లో చేరే వారి పింఛన్ను నిలుపుదల చేసేలా సీఎంపీఎఫ్ అధికారులను సింగరేణి కోరనుంది. తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే ఉద్యోగులు, అధికారులకు కోల్మైన్స్ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సమగ్ర విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను కంపెనీ వ్యాప్తంగా అన్ని గనుల కార్యాలయాల నోటీస్ బోర్డులపై కార్మికులకు అందుబాటులో ఉంచుతారు. ఈపీ ఆపరేటర్లు/ఎంవీ డ్రైవర్లు విధుల్లో చేరిన నెల రోజుల్లోగా డ్రైవింగ్ లైసెన్స్ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. విరమణ పెంపుతో ఇప్పటికే రిటైరైన 1,082 మంది ఉద్యోగులతో కలుపుకొని మొత్తం 43899 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.
ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు
2021 మార్చి 31 వరకు విరమణ పొందిన ఉద్యోగుల గ్రాట్యూటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ తీసుకున్న ఉద్యోగులు, అధికారులు విధుల్లో చేరిన 15 రోజుల్లో ఆ సొమ్మును కంపెనీకి చెల్లించాలి. ఒక వేళ గ్రాట్యూటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్ సొమ్ము చెల్లించకపోతే క్యాష్ క్రెడిట్ రేటు ప్రకారం వడ్డీని నెలనెలా జీతం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. వారు 61 ఏళ్ల తర్వాత విరమణ అనంతరం అప్పటికీ వడ్డీ రూపంలో చెల్లించిన మొత్తాన్ని మినహాయించుకొని మిగిలిన సొమ్మును నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
గ్రాట్యూటీ, ఎఫ్బీఐఎస్, జేపీఏఐఎస్, జీఐఎస్, లీవ్ ఎన్ క్యాష్మెంట్ లాంటి టర్మినల్ బెనిఫిట్లను నిబంధనల మేరకు 61 ఏళ్ల పదవీ విరమణ తర్వాత చెల్లిస్తారు.
ఉద్యోగ విరమణ పొంది పింఛన్, సీఎంపీఎఫ్ డబ్బు తీసుకున్న వారి విషయంలో సీఎంపీఎఫ్ అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. వీటికి వేరే ఉత్తర్వులు విడుదల చేశారు.
మార్చి 31 తర్వాత రిటైర్ అయి చనిపోయిన వారిని కంపెనీ సర్వీసులూ ఉన్నప్పుడే మరణించిన వారిగా పరిగణించి వారి కుటుంబానికి కం పెనీ ద్వారా అందే ప్రయోజనాలను అందిస్తారు.
ఇంకా ప్రాసెస్ కానీ గ్రాట్యూటీ, సీఎంపీఎఫ్, ఇతర ైక్లెయిమ్లను తక్షణమే ఉపసంహరించుకోవడం/ రద్దు చేస్తారు. కార్మికులు, అధికారి పదవీ విరమణ పొందిన అనంతరం ప్రాసెస్ చేస్తారు.
సీపీఆర్ఎంస్ మెడికల్ కార్డు తీసుకున్న వారు వాటిని తిరిగి కంపెనీకి ఇచ్చేయాలి. రిటైర్ అయిన తర్వాత మళ్లీ కార్డులు జారీ చేస్తారు. దానిపై ఉన్న బ్యాలెన్స్ను వారు ఉపయోగించుకోవచ్చు.
ఉద్యోగుల వేతన సవరణ జేబీసీసీఐ ఒప్పందాల ప్రకారం ఉంటుంది. అధికారుల వేతన సవరణ పీఆర్సీ/డీపీఈ నిబంధనల ప్రకారం ఉంటుంది.
తిరిగి విధుల్లో చేరే కార్మికుల, అధికారుల సీనియార్టీని కాపాడుతారు. ఉద్యోగ విరమణ వయసు పెంపు ఉత్తర్వులపై సింగరేణి ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సింగరేణి ఉన్నతికి మరింత అంకిత భావంతో పని చేస్తామని పేర్కొంటున్నారు.