మహబూబ్నగర్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యువతకు ఉద్యోగాలతోపాటు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఐటీ పార్కుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి శివారులో గత ప్రభుత్వం 400 ఎకరాల్లో సుమారు రూ.40కోట్ల వ్యయంతో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టింది. టైర్ టూ పట్టణాల్లో ఐటీ పార్కులను కేసీఆర్ సర్కారు ప్రోత్సహించింది. ఇందులో భాగంగా వెనుకబడిన జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన నిర్మాణం పూర్తి చేసుకున్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ ఎనర్జిటిక్ పార్కును పట్టించుకోవడం మానేసింది.
రేవంత్ సర్కారు నిర్లక్ష్యంతో ఐటీ వెలుగులు ప్రసరిస్తాయో లేదో నన్న అనుమానాలు నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఎందరో ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు దేశ, విదేశాల్లో ఐటీ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. అయితే స్థానికంగా ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రముఖ కంపెనీలన్నీ ఇక్కడి నుంచే వారి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉండేలా నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించడంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి.
మహబూబ్నగర్ జిల్లా రూపురేఖలు మారే దశలో కాంగ్రెస్ సర్కారు శీతకన్ను పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దేశంలోనే తొలి లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాలు దివిటిపల్లి సమీపంలోనే కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీ అయిన అమరరాజ ఈవీ ఫ్యాక్టరీకి కేసీఆర్ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. జీరో పొల్యూటెడ్గా ఈ గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. కంపెనీ ఏర్పాటుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశం ఉన్నది. గత కొన్ని రోజులుగా కొందరు ఆందోళనలు చేపడుతున్నారు. ఇటు ఐటీ టవర్పై.. అటు ఈవీ ఫ్యాక్టరీపై రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వలసలు, కరువుకు నిలయమైన మహబూబ్నగర్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం సుమారు 13 కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నది. ప్రస్తుతం మూడు కంపెనీలు మాత్రమే ఇక్కడి నుంచి వారి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. జాతీయ రహదారి 44కు అతి సమీపంలో, దివిటిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ఐటీ పార్క్తో చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరాకు రూ.4 నుంచి 5 లక్షలు పలకని భూముల ధరలు నేడు రూ.కోటి నుంచి రూ.కోటిన్నరకు చేరాయి.
హైవే నుంచి నేరుగా పార్కు మీదుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి నాలుగులేన్ల రహదారి నిర్మాణమైంది. హైదరాబాద్ నుంచి తరలివచ్చే ఐటీ ఉద్యోగులకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగపడుతున్నది. దివిటిపల్లి, అంబటిపల్లి, ఎదిర గ్రామాలతోపాటు మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ ప్రాంతాలు ఊహించని రీతిలో అభివృద్ధిలో పరుగులు పెట్టే అవకాశమున్నది. అయితే రేవంత్ సర్కారు వీటిపై దృష్టి సారించకపోవడంతో వీటి ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏర్పాటు చేయలేమని సదరు కంపెనీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
ఎలక్ట్రానిక్ యుగం పరుగులు తీస్తున్నది. ఈ నేపథ్యంలోని మహబూబ్నగర్ ఐటీ పార్కులో రూ.9వేల కోట్ల పెట్టుబడితో అమరరాజా కంపెనీ లిథియం గిగా ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఇక్కడ తయారయ్యే బ్యాటరీలు దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతో ఉపయోగం కానున్నాయి. ఇది దేశంలోనే తొలి గిగా ఫ్యాక్టరీ. దీంతో మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
యూఎస్, చైనా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 240 గిగా ఫ్యాక్టరీల విప్లవానికి నాయకత్వం వహిస్తున్నాయి. మనదేశంలో మహబూబ్నగర్ ప్రాంతంలో ఏర్పాటు కానుండడంతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగు పడనున్నాయి. జీరో పర్సెంట్ కాలుష్య రహితంగా కంపెనీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే ఇతర అనుబంధ పరిశ్రమల పెట్టుబడులు ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకామున్నది. సప్లయర్లు, సర్వీస్ ప్రొవైడర్లు రావడంతో అదనపు ఉద్యోగావకాశాలు వస్తాయని భావిస్తున్నారు .
లిథియం గిగా ఫ్యాక్టరీ వద్దని కొన్ని రోజులుగా కొందరు ఆందోళనకు దిగుతున్నారు. కానీ పూర్తిగా కాలుష్య రహితంగా ఉంటుందని గత ప్రభుత్వం వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి పదార్థాలు పర్యావరణ అనుకూల వనరుల నుంచి తీసుకుంటాయని నిర్ధారించింది. కార్బన్ ఫుట్ ప్రింట్స్ను తగ్గించడానికి సౌర, పవన శక్తి (సోలార్ అండ్ విండ్ పవర్) వంటి పునరుత్పాదక ఇంధన వనరులను కూడా ఉపయోగించడంతో కాలుష్యం పూర్తిగా తగ్గనున్నది.
గిగా ఫ్యాక్టరీల సర్క్యులర్ వాల్యూ చెయిన్స్ను అనుసరిస్తాయి. ఇందులో ఉపయోగించిన పదార్థాలు వృథా కాకుండా రీసైకిల్ చేయబడతాయి. అదనంగా ఆటోమేషన్ ద్వారా సుస్థిరతను స్వీకరిస్తాయని తేలింది. సంప్రదాయ బ్యా టరీ ఫ్యాక్టరీల కాకుండా ఎక్కువ కంప్యూటర్, రోబోటిక్స్ పద్ధతులను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి హాని కాదని తేలింది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలు ఇక్కడ తయారు చేసి దేశవ్యాప్తంగా ఎగుమతి చేయ
నున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఐటీ ఇండస్ట్ట్రీయల్ టవర్ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీనివల్ల నిరుద్యోగులకు భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వ విధానాలు ఏమున్నా సొంత జిల్లాపై రేవంత్ ప్రత్యేక దృష్టి సారించి ఐటీ టవర్లో సాఫ్ట్వేర్ కంపెనీలను రప్పించి ఈ ప్రాంతానికి మేలు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లేదంటే నిరుద్యోగులకు ఆందోళన తప్పదు.