అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాలకుగానూ 10 సెగ్మెంట్లలో హస్తం పార్టీదే హవా కొనసాగింది. రెండు స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. మొదటి సారే విజయంతో అలంపూర్ అభ్యర్థి విజయుడు భారీ మెజార్టీతో సత్తా చాటారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. సాయంత్రం వరకు కొనసాగింది. గెలిచిన అభ్యర్థులకు ఆయా రిటర్నింగ్ అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ విజయంతో అభ్యర్థుల్లో జోష్ నెలకొనగా.. పార్టీ క్యాడర్ సంబురాల్లో మునిగిపోయింది.
మహబూబ్నగర్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలను కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్ పార్టీ జోగుళాంబ గద్వాల జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకున్నది. ఆ దివారం మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లా కేం ద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ప్రక్రియ ఉ త్కంఠగా సాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం నా లుగు గంటల వరకు కొనసాగింది. గెలిచిన అభ్యర్థులకు ఆయా రిటర్నింగ్ అధికారులు విన్నింగ్ సర్టిఫికెట్లు అందజేశారు. మహబూబ్నగర్లో శ్రీనివాస్గౌడ్, వనపర్తిలో నిరంజన్రెడ్డి ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన జూపల్లి కృష్ణారావు, కశిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, కూచకుళ్ల రాజేశ్రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు, నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికరెడ్డి, వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి తుడి మెఘారెడ్డి, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి, మక్తల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్రెడ్డి గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగు పెట్టనున్నారు. కాగా, వనపర్తిలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కాన్వాయ్పై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు విసిరడంతో కారు ధ్వంసమైంది. పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్రెడ్డి సోదరుడి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండుకు రెండు స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఆ జిల్లాలో గులాబీ జోష్ నెలకొన్నది. అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.
మహబూబ్నగర్ జిల్లాలోని మూడుస్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్రెడ్డి మంత్రి శ్రీనివాస్గౌడ్పై 16,992 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. శ్రీనివాస్రెడ్డికి 84,728 ఓట్లు రాగా శ్రీనివాస్గౌడ్కు 67,736 ఓట్లు వచ్చాయి. జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్రెడ్డి తన సమీప ప్రత్యర్థి లక్ష్మారెడ్డిపై 15,333 మెజార్టీతో విజయం సాధించారు. అనిరుధ్రెడ్డికి 90,145 ఓట్లు రాగా లక్ష్మారెడ్డికి 75,515 ఓట్లు వచ్చాయి. దేవరకద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి స్వల్ప మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డిపై విజయం సాధించారు. మధుసూదన్రెడ్డికి 87,909 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆలకు 87,002 ఓట్లు వచ్చాయి. ఇక నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీహరికి 74,917 ఓట్లు రాగా చిట్టెంకు 57,392 ఓట్లు వచ్చాయి.
పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికరెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్రెడ్డిపై 7,506 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పర్ణికకు 84,005 ఓట్లు రాగా రాజేందర్రెడ్డికి 76,499 ఓట్లు వచ్చాయి. నాగర్కర్నూలు జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్రెడ్డిపై 28,988 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జూపల్లికి 91,853 ఓట్లు రాగా బీరానికి 62,872 ఓట్లు వచ్చాయి. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేశ్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి జనార్దన్రెడ్డిపై 5,371 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజేశ్రెడ్డికి 86,198 ఓట్లు రాగా మర్రికి 80,827 ఓట్లు వచ్చాయి. అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన సమీప ప్రత్యర్థి గువ్వల బాలరాజుపై 49,326 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వంశీకృష్ణకు 1,13,761 ఓట్లు రాగా గువ్వలకు 65,661 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కశిరెడ్డి నారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 5,410 ఓట్లతో గెలుపొందారు. కశిరెడ్డికి 75,858 ఓట్లు రాగా తల్లోజు ఆచారికి 70,448 ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది.
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ జిల్లాలోని రెండు స్థానాలను క్లీన్ స్వీప్ చేసి గులాబీ సత్తా చాటింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి నిరాశజనకంగా మారాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఒంటిచేత్తో అలంపూర్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు. రాజకీయాలకు కొత్త వ్యక్తి అయిన విజయుడిని చివరి నిమిషంలో తెరపైకి తెచ్చి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశారు. అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయుడు తన సమీప ప్రత్యర్థి సంపత్కుమార్పై 30,573 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడికి లక్షా 370 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి 72,550 ఓట్లు వచ్చాయి. గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి రెండోసారి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల తన సమీప ప్రత్యర్థి సరితపై 7,036 ఓట్ల తేడాతో గెలుపొందారు. కృష్ణమోహన్రెడ్డికి 94,097 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సరితకు 87,061 ఓట్లు వచ్చాయి.