బాలానగర్, సెప్టెంబర్ 23 : పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, పెద్దరేవల్లి, బోడజానంపేట, మోతీఘణపూర్, ఉడిత్యాల, నేరళ్లపల్లి, గుండేడ్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 57 ఏండ్లకే పింఛన్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలోని అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు మతిభ్రమించిందని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. బీజేపీకి గతంలో ఉన్న సిద్ధాంతాలు లేవని, ఓట్ల కోసమే జైశ్రీరాం అంటున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాలకూ తామే డబ్బులు చెల్లిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నదని ధ్వజమెత్తారు. గూడు లేని పేదలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షతో ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. అలాగే మోతీఘణపూర్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.