వనపర్తి డిసెంబర్ 3, (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రెండ్రోజులుగా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలకు ఆదివారం కౌటింగ్తో తెరపడింది. నూతన వ్యవసాయ మార్కెట్యార్డులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ను కొనసాగించారు. ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ సాఫీగా ముగిసింది. 22 రౌండ్ల ద్వారా ఫలితాలు వెలువడ్డాయి. మొదటి రౌండ్లో బీఆర్ఎస్కు కొద్దిపాటి మెజార్టీ రాగా, మిగతా రౌండ్లల్లో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ వచ్చింది. మొత్తం 2,10,739 ఓట్లు పోలింగ్ కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూడి మేఘారెడ్డికి 1,05,469 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి 81,269 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అనుజ్ఞారెడ్డికి 9,034 ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 3,935, ఏవోడీఆర్ పార్టీకి 2,390, ధర్మ సమాజ్ పార్టీకి 1,256 ఓట్లు వచ్చాయి. కాగా స్వతంత్ర అభ్యర్థులు రజినీకాంత్కు 2,143, కాట్రావత్ రాములుకు 2,012 ఓట్లు వచ్చాయి. మిగిలిన స్వంతంత్రులకు 150 నుంచి 400లోపు ఓట్లు వచ్చాయి. మొత్తం 13మంది పోటీ చేయగా నోటాకు 1,928 ఓట్లు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదేనని, అందుకు ప్రతిఒక్కరూ కట్టుబడాలన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గడిచిన అయిదేండ్లు నిర్విరామంగా ప్రజల కోసమే పని చేశానన్నారు. అయినప్పటికీ ప్రజల విశ్వాసం అభివృద్ధి వైపు నడవలేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలే అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించారని, అందుకు తగ్గట్టుగా పని చేశానన్నారు. మళ్లీ అవకాశం ఇవ్వకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసమే పని చేస్తానన్నారు.