మహబూబ్నగర్టౌన్, మే 17: బడి మానేసిన విద్యార్థుల వివరాలు సేకరించి వారిని పాఠశాలలో చేర్పించేందు కు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో అర్బన్, రూరల్ ప్రాంతాల వారీగా సీఆర్పీలు సర్వే చేస్తున్నారు. 6నుంచి 14ఏండ్లు, 15 నుంచి 19ఏండ్లలోపు బాలబాలికలను గుర్తించి వారి వివరాలను పోర్టల్లో పొందు పరుస్తారు. వచ్చే విద్యా సంవత్సరంలో వారి వయస్సును బట్టి ఆయా తరగతుల్లో చేర్పిస్తారు. అయితే ఈ సారి సర్వేలో పిల్లల ఆధార్, వారి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ వంటి వివరాలను సేకరిస్తున్నారు. సీఆర్పీలు క్షేత్రస్థాయిలో తిరిగి బడిబయటి పిల్లల వివరాలను సేకరిస్తున్నా రు. బడిలో చేరిన పిల్లల వివరాలను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయడం నుంచి విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు వారు బడిలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించారు. సర్వే జరుగుతున్న తీరును ప్రతిరోజూ సెక్టోరల్ అధికారులు పర్యవేక్షించడంతోపాటు వారి నుంచి డీఈవో వివరాలు సేకరిస్తున్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలనే లక్ష్యంతో జిల్లావ్యాప్తంగా బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసేలా సర్వే చేస్తున్నారు.
ఈనెల 31 వరకు సర్వే..
బడి మానేసిన విద్యార్థుల వివరాలను సేకరించేందుకు చేపట్టిన సర్వేలో సీఆర్పీలు(క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు) నిర్వర్తించాల్సిన విధులపై డీఈవో ఉషారాణి ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జూమ్ యాప్ నుంచి నిర్వహించిన సమావేశంలో ఉన్నతాధికారులు సూచించిన మార్గదర్శకాలను వివరించారు. విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో, ప్రబంధ్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. సూచించిన ప్రాంతాల్లో ఈ నెల 31లోగా సర్వే పూర్తి చేయాలని సీఆర్పీలకు ఆదేశించారు. సర్వేలో సేకరించిన బ డి మానేసిన పిల్లల వివరాలను పోర్టల్లో పొందుపర్చాల్సి ఉంది. పూర్తిస్థాయి నివేదికను ఈ నెల 31లోగా విద్యాశాఖ కమిషనర్కు అందజేయాల్సి ఉంది. ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి ఏ ఒక్క విద్యార్థి బడి మానేయకుండా చర్యలు తీసుకుంటారు. సర్వే పూర్తి వివరాలు సేకరించాలని డీఈవో సూచించారు.
పకడ్బందీగా వివరాల సేకరణ
మహబూబ్నగర్ జిల్లాలో మూడు నియోజకవర్గాల వా రీగా మొత్తం 16 మండలాల్లో 48సీఆర్పీలు సర్వేను పకడ్బందీగా నిర్వహించి వివరాలు సేకరిస్తున్నారు. 6 నుంచి 14 ఏండ్లు, 15 నుంచి 19ఏండ్లలోపు బాలబాలికలను గు ర్తించి వివరాలను కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు. ఏ టా బడి మానేసిన పిల్లలపై నిర్వహిస్తున్న సర్వేలో ప్రభు త్వం తీసుకుంటున్న ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2018-19, 2019-20, 2020-21, 2021-22 నుం చి సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది డ్రాపౌట్స్ తగ్గుతున్నాయి. ప్రస్తుత ఈ విద్యాసంవత్సరానికి ఇప్పటికి వర కు 181మంది బడిబయటి పిల్లలను గుర్తించారు.
సర్వే పకడ్బందీగా చేస్తాం
జిల్లాలో బడిబయట పిల్లల వివరాలు సేకరించేందుకు 48మంది సీఆర్పీలతో సర్వే చేస్తున్నాం. ఈ నెల చివరి నాటికి సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నాం. 16మండలాల్లో బడిబయట పిల్లలతో అనాథలైన పిల్లల వివరాలు పోర్టలో నమోదు చేస్తాం. సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం. బడిబయటి పిల్లలను బడిలో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తాం.
– ఉషారాణి. డీఈవో మహబూబ్నగర్