కోస్గి, మే 3 : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. కర్షకులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. బుధవారం పట్టణంలో పీఏసీసీఎస్ కార్యాలయం, మార్కెట్ ఆవరణ, గుండుమల్ మండం బోగారంలో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన ఉన్నంత కాలం రైతులకు ఎలాంటి కష్టం రానివ్వడని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఆందోళన చెందవద్దని సూచించారు.
ప్రకృతి ప్రకోపంతో ధాన్యం తడిస్తే రైతు నష్టపోవద్దని ఆలోచించిన మహానేత కేసీఆర్ అన్నారు. అలాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ రైతుల అదృష్టంగా భావించాలన్నారు. ధాన్యం ఏ-గ్రేడ్కు రూ.2,060, బీ-గ్రేడ్కు 2,040 ధర చెల్లిస్తున్నదని తెలిపారు. రైతులందరూ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూ చించారు. వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, ఎంపీపీ మధుకర్రావు, జెట్పీటీసీ ప్రకాశ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి, రైతులు పాల్గొన్నారు.