వనపర్తి, డిసెంబర్ 31 : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్వచ్ఛ మున్సిపాలిటీగా వనపర్తిని తీర్చిదిద్దాలని భారతీయ రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) శాస్త్రవేత్త వీరభద్రం పిలుపునిచ్చారు. ఇందుకోసం వ్యాపారులు, అధికారులు ముం దుకు రావాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయహాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత కవర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్తో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకొని ప్లాస్టిక్ను తరిమికొట్టాలన్నారు. మొక్కజొన్న రసాయనాలతో తయారు చేసిన ప్లాస్టిక్ వాడకంతో ఎలాంటి హాని ఉండదని, భూమిలో 60 నుంచి 70 రోజుల్లోనే కలిసిపోతుందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ మాట్లాడుతూ మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ విషపూరితమైనదని, దీంతో సముద్రాలు సైతం కలుషితం అవుతున్నాయని తెలిపారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా జీవించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.
మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం ఓ ప్యాషన్లా మారిందన్నారు. క్యానర్స్, గుండె జబ్బు లు, జీర్ణాశయం, పేగు, ఊపిరితిత్తులు, నరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. ప్లాస్టిక్ను డ్రైనేజీల్లో వేయడంతో పేరుకుపోయి వర్షాల సమయంలో వరదలకు కారణమవుతున్నాయని చెప్పారు. స్వచ్ఛ మున్సిపాలిటీగా వనపర్తిని తయారు చేసేందుకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు. ప్లాస్టిక్తో భూసారం తగ్గడంతోపాటు పర్యావరణానికి ఉపయోగపడే జీవుల జీవన చక్రంపై ప్రభావం చూపి నేల సారవంతాన్ని తగ్గిస్తాయన్నారు. పశువులు ప్లాస్టిక్ కవర్లను తినడంతో వాటి జీర్ణాశయంలో పేరుకుపోయి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయని చెప్పా రు. ప్రతి వ్యాపారస్తుడు వారి వద్దకు వచ్చే వినియోగదారులకు ప్లాస్టిక్ రహిత కవర్లును వినియోగించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, శతా బ్ధి గ్రూపు నిర్వాహకులు సంతోశ్శర్మ, గ్రీన్ స్మార్ట్ టెక్నాలజీ సీఈవో రామకృష్ణ, డైరెక్టర్ మూర్తి, బయోడీ గ్రేబబుల్ ప్రొడక్ట్ మ్యాన్ఫ్యాక్చర్స్ ప్రసాద్ రమణి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమేశ్, వ్యాపార సంఘం నాయకుడు కొట్ర రామకృష్ణ, వ్యాపారులు పాల్గొన్నారు.