వనపర్తి : వనపర్తి నియోజకవర్గానికి మరో రెండు నూతన 33/11 సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి రూ.163.41 లక్షలతో అడ్డాకుల మండలం పెద్ద మునగాల చేడ్లో రూ.222.57 లక్షలతో సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిపించి సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఆవిర్భావానికి ముందు కరెంట్ కోతలతో పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించేదని, బోర్లున్నా సకాలంలో కరెంట్ రాక రైతుల పొలాలు ఎండిపోయేవని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్ సమస్య మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వ్యవసాయం, పరిశ్రమలు, గృహావసరాలకు 24 గంటల నాణ్యమైన కరంటు అందిస్తున్నామని తెలిపారు.
ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే ఈ ఏడేళ్ల కాలంలో 18 నూతన సబ్ స్టేషన్లు తీసుకువచ్చామని, కోతలు లేకుండా నాణ్యమైన కరంటు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. నూతన సబ్ స్టేషన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.