నారాయణపేట టౌన్, జూన్ 3: పట్టణప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరిచందన అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇండ్లలో తడి, పొడిచెత్తను వేరుచేసి మున్సిపల్ ఆటోలో వేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటేందుకు ప్రభుత్వ స్థలం అవసరం లేదని, ఖాళీగా ఉన్న ఏ స్థలంలోనైనా నాటవచ్చన్నారు. వార్డులో సమావేశం ఏర్పాటు చేసుకొని వార్డుకు కావాల్సిన వసతులపై చర్చించుకోవాలన్నారు. అనంతరం 2వ వార్డులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. క్రీడా ప్రాంగణంలో ఆటలాడుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్ అనిత, ప్రత్యేకాధికారి జ్యోతి, వార్డుప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు సూచించారు. 4వ విడుత పట్టణ ప్రగతి కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రారంభమైంది. ఆయా వార్డుల్లో సమావేశాలు నిర్వహించి వార్డులో నెలకొన్న పారిశుధ్యం, విద్యుత్, సీసీ రోడ్డు, మురుగు కాలువలు, తాగునీరు తదితర సమస్యలు గుర్తించి, ఆయా సమస్యల పరిష్కారంపై చర్చించారు. 11వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్ అమీరుద్దీన్ సమావేశంలో పాల్గొని వార్డు సమస్యలపై చర్చించారు. 10వ వార్డులో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. 8వ వార్డులో టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, కౌన్సిలర్ సునీత పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. 3వ వార్డులో కౌన్సిలర్ సత్యరఘుపాల్, ప్రత్యేక అధికారి స్వప్న పాల్గొనగా, 2వ వార్డులో మున్సిపల్ కమిషనర్ సునీత, కౌన్సిలర్ అనిత పాల్గొని వార్డు సమస్యలపై చర్చించారు.
‘పల్లెప్రగతి’తో గ్రామాల అభివృద్ధి :జెడ్పీ చైర్పర్సన్ వనజ
మరికల్, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాలు ఆభివృద్ధి చెందుతున్నాయని నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని మండలంలోని కన్మనూర్లో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రతి పల్లె పచ్చగా ఉండాలనే సంకల్పంతో హరితహారం, పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, ఎంపీపీ శ్రీకళ, సర్పంచ్ శరత్చంద్రరెడ్డి, ఎంపీడీవో యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.