కళ్యాణలక్ష్మి పథకం పేదలకు వరం అని.. సబ్బండ వర్ణాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని.. ప్రజల అవసరాల ప్రాతిపదికగా పథకాలు అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
వనపర్తిలోని క్యాంపు కార్యాలయంలో 402 మందికి ఈ నెల మొదటి విడతలో భాగంగా మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసి వారితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి.. కేసీఆర్ కిట్, అమ్మవడి, ఆసరా ఫించన్లు, గురుకుల పాఠశాలలు, హెల్త్ హైజీన్ కిట్లు, రైతుబంధు, రైతు బీమా, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్మస్ కానుకలు.. లాంటి ఎన్నో పథకాలు పేదల కోసం ఎంతో శ్రమించి సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు. 70 ఏళ్ల భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు, ఎవరి ఊహకు అందని పథకాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు, డబల్ బెడ్రూం ఇండ్లు, రైతు వేదికలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు.
తెలంగాణ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యవంతమైన, ఆనందదాయకమైన తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.
హాకీ నేషనల్ జూనియర్ టోర్నీకి ఎంపికైన వనపర్తి బాలికలు పాత్లావత్ గంగోత్రి అఖిల, శిరీషకు మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా హాకీ గోల్ కీపర్ పాత్లావత్ గంగోత్రికి హాకీ కిట్ అందజేశారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు ఏపీలోని కాకినాడలో జరగనున్న టోర్నీలో తెలంగాణ జట్టు తరపున బాలికలు ఆడనున్నారు.