వనపర్తి, జూలై 4 : బస్టాండు.. హోటళ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ పక్కవారికి ఇబ్బంది కలుగుతున్నా పట్టించుకోకుండా బహిరంగంగా ధూమపానం చేస్తున్నారా.. ఇకపై జరిమానాలు తప్పవని జిల్లా స్థాయి సమన్వయ కమిటీ హెచ్చరిస్తున్నది. కమిటీ సభ్యులతో ఇటీవల వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా సమావేశమయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని నిర్ణయించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో గతంలో మాదిరిగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా సిగరెట్లు తాగితే ఉపేక్షించేది లేదంటూ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ షేక్యాస్మిన్బాషా ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. యువత ధూమపానాన్ని అలవాటుగా మార్చుకొని బానిసలై జీవితాలను గుళ్ల చేసుకుంటున్నారు. వారితోపాటు చుట్టూ ఉండే వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఇటీవల జాతీయ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ, సిగరెట్లు, టొబాకో ప్రాజెక్టు యాక్ట్-2003ను అనుసరించి జిల్లా సమన్వయ కమిటీతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ కమిటీ సభ్యుల్లో కలెక్టర్ చైర్మన్గా, కన్వీనర్గా జిల్లా వైద్యాధికారి, సభ్యులుగా ఎస్పీ, జిల్లా విద్యాధికారి, మున్సిపల్ కమిషనర్లు, డీడబ్ల్యూవో, ఆర్టీసీ డీఎం ఉంటారు.
ధూమపానం వల్ల కలిగే ఇబ్బందులు
కళ్లు, ముక్కు, గొంతు వంటి సున్నితమైన పొరలపై పొగ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది క్యాన్సర్కు దారి తీస్తుంది.
శ్వాసనాళం మందంగా మారిపోయి క్యానర్స్ వచ్చే అవకాశం ఉంది. చలి, జ్వరం, ఫ్ల్లూ త్వరగా వస్తుంది.
ఊపిరితిత్తుల్లో పొగ చేరితే గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
సిగరెట్ కాల్చిన ప్రతిసారి రక్తపోటు అమాంతంగా 15శాతం పెరుగుతుంది. దీనివల్ల కోపం, అసహనం, ఆందోళన పెరుగుతుంది.
చర్మంలో రక్తనాళాలు బిగుసుకుపోతాయి ఆక్సిజన్ సరఫరా దానంతట అదే తగ్గుతుంది. ఫలితంగా ఆయాసం వస్తుంది.
ఊపిరితిత్తులు, నోరు అన్నవాహికకే కాకుండా మెడ, స్వరపేటిక, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణాశయం వంటి అవయాలకు వ్యాపిస్తుంది.