వనపర్తి : కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే గడ్డు పరిస్థితులే పునరావృతం అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి (Minister Niranjan Reddy)పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సాగు, తాగు నీటి కొరతను పరిష్కరించామని వెల్లడించారు.
చెరువుల మరమ్మతులు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, విద్యుత్ సరఫరా వంటి వాటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పుష్కలంగా పంటలు పండుతున్నాయని అన్నారు. రైతు కష్టాలను దూరం చేసేందుకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంట్ను అందజేస్తున్నామని తెలిపారు. పేదవారిని ఆసరా ఫించన్లతో ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వల్ల వలసలు వెళ్లిన గ్రామస్థులు నేడు గ్రామాల్లో సానుకూల వాతావరణంతో తిరిగి పల్లెలకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు.
గ్రామాల్లో మౌలిక వసతులు పెంచామని అన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ను అందించనున్నామని , ఆసరా పింఛన్ను రూ.5000 వేలకు పెంచుతామని తెలిపారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో 32 వేల ఉద్యోగాలు ఇవ్వగా తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం లక్ష 62 వేలు ఇచ్చిందని , మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు.