వనపర్తి ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచింది.జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ అధికారులు కొనుగోలు చేశారు. ఇప్పటికే 2.44 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి రైస్ మిల్లులకు 97 శాతం తరలించారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.504.47 కోట్లు ఉండగా.. రైతుల ఖాతాల్లో రూ.477.23 కోట్లు జమ చేశారు.
వనపర్తిరూరల్, జనవరి 8 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంది. వనపర్తి జిల్లాలో ఇప్పటికే సహకార సంఘం, ఐకేపీ మెప్మా, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో ఇప్పటికే 97శాతం కొనుగోళ్లు పూర్తి కావస్తున్నట్లు అధికారుల సమాచారం. రైతులు ఎదురుచూపులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేస్తూ వెంటనే రైతులకు రెండు రోజుల వ్యవధిలోనే నగదును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.
అలాగే కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల నుంచి వెంటనే రైస్మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 97శాతం పైగా కొనుగోలు పూర్తికావచ్చాయని, వారం రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ధాన్యం వచ్చే అంచనాలను బట్టి కేంద్రాల ద్వారా కొనుగోలు ముగించాలన్న, కొనసాగించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో దాదాపు 1,83,122.38 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వం నాణ్యమైన ఏ గ్రేడ్ క్వింటాకు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర చెల్లించింది.
అకాల వర్షాలు, దోమపోటుతో పాటు పలు మండలాల్లో రైతులు పండించిన పంటల్లో సరైన దిగుబడి చేతికి అందలేదు. అయినా ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజనూ నష్టపోకుండా రైతులనుంచి కొనుగోలు చేస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం పెద్ద మొత్తంలో రైతుల ద్వారా కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సమాఖ్య, మెప్మా, మార్కెట్ కమిటీ సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 241కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ధాన్యం రైతులు ఆరబెట్టుకునేందుకు వసతులతోపాటు టార్ఫాలిన్లు, తూర్పార పట్టే యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, తూకం చేసే యంత్రాలను అందుబాటులో ఉంచారు.
ముమ్మరంగా కొనుగోళ్లు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా చేపట్టారు. అక్టోబర్లో కొనుగోళ్లు ప్రారంభించగా జనవరి 2023 శనివారం నాటికి జిల్లాలో 44,604మంది రైతుల నుంచి 2,44,887 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 2,39,199 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలను ట్యాబ్లో నమోదు చేయగా 48గంటల అనంతరం రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. ఇప్పటివరకు రూ.504.47కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా 41,469మంది రైతులకు గానూ రూ.477.23కోట్లు ఖాతాల్లో జమ చేశారు.
కొనుగోలు చేస్తాం
మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని మండలాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. గోపాల్దిన్నె, చిన్నంబావి మండలంలో పూర్తికావచ్చింది. రైతులనుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేవరకు కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తాం. ఏ ఒక్క రైతు ఆధైర్యపడకుండా చర్యలు తీసుకున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాం.
– కొండల్రావు, సివిల్ సప్లయి మేనేజర్, వనపర్తి జిల్లా