వనపర్తి, ఏప్రిల్ 26 : నయనం ప్రధానమని అన్నారు పెద్దలు.. కంటిచూపు లేకపోతే సర్వం శూన్యమే.. కంటి సమస్యల గురించి తెలియక, ఎక్కడికి వెళ్లి చికిత్స చేయించుకోవాలో అర్థంకాక చాలామంది చూపును కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంధత్వరహిత సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఊరూరా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్లద్దాలు, మందులను అందజేసేందుకు రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వనపర్తి జిల్లాలో జనవరి 19న వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించగా, ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు జనం క్యూకడుతున్నారు. 18ఏండ్లు నిండిన వారందరికీ వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు, మందులను అందజేస్తున్నారు. శిబిరాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్వో రవిశంకర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో వందశాతం పరీక్షలు నిర్వహించేందుకు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. అంధత్వరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
2,73,024 మందికి పరీక్షలు
రెండోవిడుత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఏప్రి ల్ 26వ తేదీవరకు 63రోజుల్లో 2,81,299మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28,205మందికి రీడింగ్ అద్దాల ను పంపిణీ చేశారు. సిలిన్డిక్రల్ (దూరపు, దగ్గరచూపు) అద్దాలు అవసరమైన వారికి చేయించడానికి కాస్త సమయం పడుతుందని, ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరంలేదని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే కంటి ఆపరేషన్లకు 14,585మందిని గుర్తించారు.
పేదలకు మేలు
ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో పేదలకు మేలు చేకూరుతున్నది. కంటి సమస్యను దూరం చేసేందుకు ఉచితంగా పరీక్షలు చేసి కండ్లద్దాలు, మందులను అందజేయడం సంతోషంగా ఉంది. మా లాంటి పేదలకు మరింత ఉపయోగకరంగా ఉంది. మా ఇంట్లో అందరం కంటి పరీక్షలు చేయించుకున్నాం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– నిరంజన్, పొల్కెపహాడ్, గోపాల్పేట మండలం
సద్వినియోగం చేసుకోవాలి
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం , శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తించడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో 63రోజుల నుంచి విజయవంతంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 18ఏండ్లు పైబడిన వారందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సాయినాథ్రెడ్డి, ప్రోగ్రాం అధికారి, వనపర్తి