పోలింగ్ రోజు ఏదో ఒక పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి ఓటరు స్లిప్ తీసుకొని పోలింగ్ కేంద్రానికి వెళ్లి అక్కడ అధికారులకు చూపించి బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయడం గతంలో ఉన్న ప్రక్రియ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు ఎవరికి ఓటు వేశారో అక్కడే చూసుకునే వీలును ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు వీవీ ప్యాట్, ఈవీఎం మిషన్పై అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
గతంలో పోలింగ్ కేంద్రానికి ప్రజలు ఓటరు స్లిప్పులు తీసుకెళ్లి అధికారులకు చూపించి బ్యాలెట్ బాక్స్లో తమ ఓటును వేసేవారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లో రెండు రకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి కంట్రోల్ యూనిట్ కాగా మరొకటి బ్యాలెట్ యూనిట్ యంత్రం. ఓటింగ్ యంత్రాల నిర్వహణలో పారదర్శకంగా ఉండేందుకు 2018 డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదనంగా ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్( వీవీప్యాట్) అనే మరో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2018లో ఈ యంత్రం ద్వారానే ఎన్నికలు జరిగాయి. ప్రసుత్తం 2023 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పర్యవేక్షణలో ఈవీఎం, వీవీ ప్యాట్ల వినియోగం, ఉపయోగాలు, ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానంపై మాస్టర్ ట్రైనీలు, ఎలక్ట్రోరల్ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లో శిక్షణ, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
వీవీప్యాట్ ప్రయోజనాలు..
ఎన్నికల కేంద్రంలో బ్యాలెట్ యూనిట్పై ఓటు వేయగానే తాను ఏ అభ్యర్థికి ఓటు వేసింది.. ఏ గుర్తు బటన్ నొక్కిన వివరాలు వీవీప్యాట్ యంత్రంలోని చిన్నపాటి కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది. ఈ సమాచారం ఏడు సెకన్ల పాటు నిలిచి ఆ తర్వాత అదృశ్యమవుతుంది. ఇలా అదృశ్యమైన సమాచారం వెంటనే ఓ చిన్నకాగితంపై ముద్రణై అదే యంత్రంలోని అడుగుభాగాన ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆ ఓటు సమాచారం పోలింగ్ అధికారి వద్ద ఉండే కంట్రోల్ యూనిట్కు చేరుతుంది. 2018 ఎన్నికల ముందు బ్యాలెట్ యూనిట్లోకి వెళ్లి నిక్షిప్తమయ్యేది. ఇప్పుడు ఆ రెండింటి మధ్య వీవీప్యాట్లు ఉంటాయి. ఎప్పుడైనా, ఎవరైనా ఓటరు తన ఓటుపై అనుమానం, అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వీవీ ప్యాట్లో నమోదైన కాగితాల ఆధారంగా పరిశీలించేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పిస్తోంది.
కలెక్టరేట్లో వీవీప్యాట్ ఏర్పాటు..
ఇటీవల కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జిల్లాకేంద్రంలో రెండు మొబైల్ వాహనాలను ప్రారంభించారు. ఈ రెండు వాహనాల్లో కళాజాత బృందాలు గ్రామాల్లో తిరిగి ఈవీఎం, వీవీ ప్యాట్లపై పాటలతో అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చే వారికి కూడా వీవీ ప్యాట్, ఈవీఎం డమ్మీ మిషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
ఓటును అక్కడే చూసుకోవచ్చు..
ఎలక్ట్రానిక్ మిషన్పై ప్రజలకు చాలా అపోహలు ఉంటాయి. కానీ వీవీ ప్యాట్ ద్వారా ఎవరికి ఓటు వేశామో అక్కడే స్క్రీన్ మీద ఏడు సెకన్ల పాటు మనకు కనిపిస్తుంది. వీవీ ప్యాట్, ఈవీఎం ద్వారా వేసిన ఓటు మిషన్లో నిక్షిప్తమవుతుంది. అందుకోసమే మొబైల్ వాహనాల్లో కళాజాత బృందాలు ఊరూరా తిరుగుతూ ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టరేట్కు వచ్చే వారికి సైతం అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల వారీగా కళాజాత బృందం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– రమేశ్రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్