మహబుబ్నగర్, మే 9: ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి రవినాయక్ తెలిపారు. మంగళవారం ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాబితాలో చేర్చాల్సిన పేర్లు పొరపాటున చేర్చకపోవడం, తొలగించాల్సిన పేర్లు తొలగించకపోవడం వంటివి జరిగితే అలాంటి వివరాలను రాజకీయ పార్టీలకు సమర్పిస్తే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ప్రతివారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా తదితర అంశాలకు సంబంధించిన సమావేశం ఉంటుందన్నారు. ఓటరు జాబితాలో కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తదితరాలకు వచ్చిన అభ్యంతరాల వివరాలను వివరించారు. వీటితోపాటు ఆధార్ నెంబర్లు అప్లోడ్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 76శాతం పూర్తయిందన్నారు. మిగతా వాటిని తెప్పించి అప్లోడ్ చేయిస్తామన్నారు. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని జిల్లాస్థాయి ఏజెంట్ల వివరాలు సమర్పిస్తే ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర అంశాలపై సులభంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నుంచి సత్యంయాదవ్, బీజేపీ నుంచి అంజయ్య, టీడీపీ నుంచి మురళి, చెన్నయ్య, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు అఖిలప్రసన్న తదితరులు పాల్గొన్నారు.