మక్తల్టౌన్, అక్టోబర్ 31 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన మక్తల్కు సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6వ తేదీన తెలంగాణ అభివృద్ధి ప్రదాత, సీఎం కేసీఆర్ మక్తల్ సభకు హాజరవుతున్నారన్నారు. సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు, అభిమానులు భా రీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలుచేస్తామన్నారు. అర్హులైన వారికి రూ.400కే సిలిండర్, మహిళకు నెలకు రూ.3 వేల భృతి అందజేస్తామన్నారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’తో ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.