నారాయణపేటరూరల్, అక్టోబర్ 21 : పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూటకో సీఎం అభ్యర్థి రాజ్యమేలుతాడని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఊటకుంటతండా, బొమ్మన్పాడ్, అప్పిరెడ్డిపల్లి, జిలాల్పూర్, భైరంకొండ, ఎక్లాస్పూర్ గ్రామాల్లో శనివారం విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పెద్ద మోసం చేస్తున్నదని, అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఆదరించి తనను ఆశీర్వదించాలని కోరారు. ఐదేండ్లలో పేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, చాలా గ్రామాలు, తండాలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలుచేయడంతో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో పథకాలతో రాష్ట్రాన్ని నంబర్వన్ స్థానంలో నిలిపారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతున్నదని, ఏం చేయాలో పాలుపోక ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్కు అధికారమిస్తే వ్యవసాయానికి 3 గంటలే కరెంట్ దిక్కవుతుందన్నారు. గతంలో రైతులకు మాత్రమే రూ.5 లక్షల బీమా కల్పించగా.. ఇప్పుడు రేషన్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా’తో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించన్నుట్లు తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి భారీ మెజార్టీని కట్టబెట్టాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా త్వరలో అన్ని గ్రామాలకు సాగునీరందిస్తామన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ కావాలా..? పూటకొక సీఎం మారే కాంగ్రెస్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, జెడ్పీ కో ఆప్షన్ తాజుద్దీన్, వైస్ ఎంపీపీ సుగుణ, సర్పంచులు సీతమ్మ, ప్రభావతి, తిరుపతమ్మ, నర్సింహులు, జమునాబాయి, మండల అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రవీందర్గౌడ్, నారాయణరెడ్డి, వెంకట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.