ఆత్మకూరు, నవంబర్ 16 : కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం అవుతారని, నవంబర్ 30 ఫలితాలతో ప్రతిపక్షాల దిమ్మతిరగడం ఖాయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా బాలకిష్టాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోపన్పేట, కర్వెన, భావ్సింగ్తండా, బాలకిష్టాపూర్, మూలమల్ల, పిన్నెంచెర్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునుగుతామన్నారు. కేవలం ఓట్ల సమయంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కనిపిస్తారని, అయిపోయాక మళ్లీ ఐదేండ్ల వరకు అడ్రస్ లేకుండా పోతారన్నారు.
ప్రజల మధ్య ఉండి మీ కోసం మంచి చేసే బీఆర్ఎస్కు అండగా నిలవాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఆత్మకూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకుందామన్నారు. ఎన్నికలు పూరైన నెలరోజుల్లోనే ప్రభుత్వం నుంచి జీవోను తెప్పించి ఆత్మకూరు మండల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేరుస్తానని చెప్పారు. అనంతరం ఎర్రగొల్లలు దాదాపు 30కుటుంబాలు బీఆర్ఎస్లో చేరాయి. అదేవిధంగా బాలకిష్టాపూర్, కర్వెన, భావ్సింగ్తండా, మూలమల్ల, పిన్నెంచెర్ల గ్రామాల్లోనూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, లక్ష్మీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ శివరంజని, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్యాదవ్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.