నాగర్ కర్నూల్ : ఎస్ఎల్బీసీ (SLBC ) లో సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోజు మాదిరిగానే శనివారం నీటిని డీ వాటరింగ్ చేస్తూ తేలిన మట్టిని బయటకి లోకో ట్రైన్ ( Loco Train) ద్వారా తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 100 మీటర్ల పొడవునా లోపలి భాగంలో కన్వేయర్ బెల్టును పునరుద్ధరించడంతో అక్కడి నుంచి లోపలి వైపునకు శనివారం వెంటిలేషన్ (Ventilation) పనులను చేపట్టారు. సహాయక చర్యలపై ప్రత్యేక అధికారి శివశంకర్( Shiva Shanker ) రెస్క్యూ బృందాల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ఎల్బీసీలో (SLBC) సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు చేపడుతున్న సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు, సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న అన్ని పరిస్థితులను అధిగమిస్తూ, నిరంతరాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సహాయక బృందాలు పూర్తిస్థాయిలో నిర్విఘ్నంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
టన్నెల్ లోపల స్టీల్ తొలగింపు పనులు, మట్టి తవ్వకాలు, ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని టన్నెల్ బయటకు చేరవేసే ప్రక్రియ, సమాంతరంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. జీఎస్ఐ (GSI) అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు నిరంతరం టన్నెల్ ప్రమాద ప్రదేశం వద్ద పరిస్థితులను గమనిస్తూ, సహాయక బృందాల ఉన్నతాధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు.
శనివారం ఉదయం మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్, సింగరేణి వైన్స్ రిస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు.