కందనూలు/తిమ్మాజిపేట, మార్చి 26 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, ఆనంద్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర వద్ద, తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లి గ్రామ సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పనులను వికారాబాద్, పరిగి జెడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వట్టెం రిజర్వాయర్ పనులు 85శాతం పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే జూన్లోగా సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనులు చేయిస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రతిపక్షాల నోళ్లు మూయించడానికే పీఆర్ఎల్ఐ పనులను సందర్శించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకే ప్రాజెక్టు పనులు చేపడుతుంటే.. కావాలనే అడ్డుకోవాలని కొందరు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి భూములు పచ్చబడడం, రైతులు బాగుపడడం వారికి ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. వెంకాయపల్లి సమీపంలో ఎస్ఈలు సత్యనారాయణరెడ్డి, విజయభాస్కర్రెడ్డిని పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. మన ప్రాంతంలో ఇలాంటి పనులకు నాయకులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.