గద్వాల, జూన్ 28 : ప్రజలకు మిర్చి ఘాటు తగులుతోంది. టామాట, క్యాప్సికం, క్యారెట్ ధర వందకు తగ్గడంలేదు. కూరగాయల ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉండగా.. మరో వైపు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఈక్రమంలో ప్రజలు వాటిని కొనుగోలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకంగా కూరగాయల ధరలు కంచాల్లో కల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. బెండకాయ, బీరకాయ, కాలిఫ్లవర్, కాకర, దోస వంటి కూరగాయలు ధరలు సగటున రూ.80కు లభిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట రూ.40కే ఇవి లభించేవి. పచ్చిమిర్చి కిలో రూ.60ఉండగా ప్రస్తుతం రూ.160కి చేరింది. కొన్ని రోజులు కిందట టమాట రూ.5 నుంచి రూ.15 వరకు ఉండగా ప్రస్తుతం రూ.100కు చేరింది. దొండకాయ, చౌలకాయ, వంకాయ, బీట్రూట్, వంకాయ కేజీ రూ.40 ఉండగా ప్రస్తుతం వాటి ధర రూ.60కు చేరింది. మార్కెట్లో ఏ కూరగాయల ధరలు చూసినా కేజీ రూ.60పైనే ఉన్నాయి. గద్వాల ప్రాంతంలో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉండడంతో మదనపల్లి, బెలగాం, కర్నూల్ నుంచి కూరగాయలు తీసుకొస్తున్నారు. దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. కడప, చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు రాకపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు కూరగాయలు సాగుపై అవగాహన కల్పించకపోవడంతో మన ప్రాంతంలో కూరగాయల సాగు అంతంత మాత్రమే. బయటి మార్కెట్లో కూరగాయల ధరలు పెరుగుతున్నా.. పండించిన రైతుకు మాత్రం ఆ ధరలు అందకపోవడం విచారకరం.. రైతులు తీసుకొచ్చిన సరుకును దళారులు తక్కువకు కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయలకే పావలా వంతు భాగం వెచ్చించాల్సి వస్తుందని కూలీలు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వ్యాపారులు, దళారులకే లాభం..
రైతుల నుంచి వ్యాపారులు, దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్లో అమ్ముకోలేక, వచ్చిన కాడికి దళారులకు అమ్ముతున్నారు. రైతులు నష్టపోతుండగా వ్యాపారులు, మధ్య దళారులు లబ్ధి పొందుతున్నారు.
ఏమీ కొనలేని పరిస్థితి
రోజురోజుకూ కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తుంది. గతంలో రూ.200 కూరగాయల తీసుకెళ్తే ఐదారు రోజులు వచ్చేవి. ఇప్పుడు రూ.200 పెడితే రెండు రోజులకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. ఏవి కొనాలన్నా భయమైతుంది. ఇప్పుడున్న రేట్లకు ఏమీ కొనే, తినే పరిస్థితుల్లో లేము. పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయల జోలికి వెళ్లడం మానేశారు. ఇంట్లో ఉన్నదానితో సర్దుకుంటున్నారు. ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలి.
– జానకి, గృహిణి, పాలవాయి