వనపర్తి, ఫిబ్రవరి 24 : పంటల సాగులో ఖర్చు తగ్గించే పద్ధతులపై రైతన్న దృష్టి సారించాడు. ఈ తరుణంలో డ్రమ్ సీడర్ పద్ధతిలో(Drum Seeder) వరి సాగుకు(paddy cultivation) మొగ్గు చూపుతున్నాడు. అందుకే వనపర్తి(Wanaparthy) జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 14 మండలాల్లో 38 గ్రామాల్లో డ్రమ్సీడర్లను వ్యవసాయ అధికారులు పంపిణీ చేశారు. ఇక వరి నాట్లు వేయకుండాఈ పద్ధతిలో విత్తనాలు చల్లే పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పొలాల వద్దకు వెళ్లి వాడే విధానంపై కర్షకులకు వివరిస్తున్నారు. పంట పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి పెరుగుతున్నది. దీంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు.
రైతులు ఆరుగాలం కష్టిస్తున్నా పెరుగుతున్న పె ట్టుబడి కారణంగా వరి సాగులో ఆశించినంత లాభాలు రావడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సాగులో ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి సారించారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 1.40 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. రాష్ట్ర ప్ర భుత్వం పైలట్ ప్రాజెక్టులో భాగంగా వనపర్తి జిల్లాను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని 14 మండలాల్లో 38 గ్రామాలను ఎంపిక చేసి డ్రమ్సీడర్లను పంపిణీ చేసింది. వరినాట్లు వేయకుండా డ్రమ్సీడర్ పద్ధతి ద్వారా విత్తనాలు చల్లడం వంటి వాటిపై మండల వ్యవసాయ అధికారులు రైతులకు పంట పొలాలు, రైతువేదికల వద్ద అవగాహన కల్పిస్తున్నారు.
డ్రమ్సీడర్తో కలిగే లాభాలు..
డ్రమ్సీడర్ పద్ధతిన ఎకరాకు 8 నుంచి 10 కేజీల విత్తనాలు సరిపోతాయి.
అప్పటికే ట్రాక్టర్తో దున్ని బాగా సిద్ధం చేసిన ప్రధాన పొలంలో నానబెట్టిన వరి గింజలను డ్రమ్ సీడర్ పరికరం ద్వారా నేరుగా సాలు పద్ధతిలో విత్తనం వేసుకోవచ్చు.
ఒకేరోజు డ్రమ్ సీడర్ ద్వారా నలుగురితో ఐదెకరాల్లో విత్తనం వేసుకోవచ్చు. సాళ్ల పద్ధతిలో వేయడంతో మొక్కల మధ్య సమాన దూరం ఉంటుంది. ఈ పద్ధతిలో ఎకరాకు నాలుగైదు క్వింటాళ్ల అధిక దిగుబడి వస్తుంది.
సాధారణ పద్ధతిలో వరి సాగుచేపట్టే విధానం..
రైతులు సాధారణ పద్ధతిలో వరి సాగుచేయాలంటే.. నారుముడిని ట్రాక్టర్తో దున్నించాలి. అనంతరం మట్టి పెళ్లలు లేకుండా చేయాలి.
వరి విత్తనాలను ఒక రోజు నానబెట్టి.. మరో రోజు మండె కట్టి వచ్చిన మొలకలను అప్పటికే సిద్ధం చేసిన నారుముడిలో అలకాలి. మొలకలు పెరిగే వరకు ఒక రోజు నీరు పెట్టి మరో రోజు ఆరేలా చేస్తారు. ఇలా రెండు, మూడు రోజులు చేసిన తరువాత పలుచగా నీరు పెట్టాలి.
25 రోజుల వరకు నారు పెంచిన తరువాత.. వరి కోసం ప్రత్యేకంగా తయారుచేసిన పొలాల్లో నాటు వేస్తారు. ఎకరా పొలం నాటు వేసేందుకు కనీసం ఎనిమిది మందికిపైగా అవసరం పడుతారు. ఎకరానికి సన్న రకంకు 25 కేజీలు, దొడ్డు రకానికి 30 కేజీల చొప్పున వరి విత్తనాలు అవసరం.
ఒక్కో కూలీకి రూ.500 నుంచి రూ.600 చొప్పున చెల్లించడంతోపాటు ఉదయం, సాయంత్రం వారికి సౌకర్యాలు సమకూర్చాలి. అయినా, సరైన
సమయంలో కూలీలు దొరికే పరిస్థితి లేకపోతే గుత్త కింద మాట్లాడి నాట్లు వేస్తారు. దీనివల్ల ఖర్చులు సైతం పెరిగే అవకాశాలు ఉంటాయి.
డ్రమ్ సీడర్ పద్ధతిలో..
డ్రమ్ సీడర్ల వినియోగంపై మండల వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వారికి డ్రమ్సీడర్లను రోజుకు రూ.250 చొప్పున అద్దెకు ఇస్తున్నారు. డ్రమ్సీడర్కు నాలుగు డబ్బాలు ఉంటాయి. ఒక్కో డబ్బాల్లో తేమలేని విత్తనాలు 75 శాతం నింపాలి. ఒక్కో డబ్బాకు 18 రంధ్రాలు ఉంటాయి. ఈ పద్ధతిన ప్రధాన పొలం సమంగా ఉండేలా చేసుకోవాలి. బొందలు ఉంటే అందులో పడ్డ విత్తనాలు మురిగిపోతాయి. ప్రధానంగా వరుసల మధ్య 20 సెం.మీ. ఎడం ఉంటుంది. దీంతో కూలీలతో కలుపు తీయించకుండా కొనోవీడర్ వాడొచ్చు.
దిగుబడి పెరుగుతుంది..
డ్రమ్సీడర్తో పంట పెట్టుబడి తగ్గి దిగుబడి పెరుగుతుంది. ప్రధానంగా ఎకరాకు రూ.10వేల వరకు ఖర్చులు ఆదా అవుతాయి. పైలట్ ప్రాజెక్టు కింద పాన్గల్ మండలంలో మల్లాయిపల్లి, రేమద్దుల, మాందాపూర్ గ్రామాలను ఎంపిక చేశాం. ఆయా గ్రామాల్లో వంద ఎకరాల్లో డ్రమ్సీడర్ ద్వారా సాగు చేపడుతున్నారు. అవసరమైన వారికి పరికరాలను అద్దెకు ఇస్తున్నాం.
– సాజిత్ రహెమాన్, ఏవో, పాన్గల్