వడ్డేపల్లి, ఏప్రిల్ 16 : సర్వరోగ నివారిణిగా పేరున్న అంజీర.. రోగనిరోధక శక్తిని పెంచి ఆయుష్షును పెంచుతోంది. అంజీర పండ్ల తోటలను వడ్డేపల్లి మండలంలోని జిల్లెడదిన్నె, రామాపురం, చింతలక్యాంపు గ్రామాల్లో వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
సాగు విధానం..
నీటి సౌకర్యం ఉన్న ఎర్రనేలల్లో పంట సాగు చేసుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న బళ్లారి, ఆత్మకూరు, అనంతపురం, హైదరాబాద్లో ఈ పంట సాగు అధికంగా ఉన్నది. పంట వేసిన మూడో సంవత్సరం నుంచి కాపు వస్తుంది. ఎకరాకు 300 నుంచి 400 కేజీల వరకు పంట చేతికొస్తుంది. ఒకసారి పంట వేస్తే ఆరేండ్లు కాపు వస్తుంది. ఫర్టిలైజర్ అవసరం తక్కువగా ఉంటుంది. ఒక మొక్కకు ప్రతిరోజూ యాభై లీటర్ల నీరు అవసరమవుతుంది. అంజీర పంటకు జీవామృతం, పశువుల పేడ, ఆర్గానిక్ ఎరువులు వేయాల్సి ఉంటుంది. తుప్ప తెగులు, మొక్క ఎండుతెగులు రాకుండా చూసుకోవాలి. అంజీర తినడం వల్ల ఆయుః ప్రమాణం పెరగడంతోపాటు రక్తం వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పంట రకాలు
అంజీరాలో బళ్లారి, డయానా, బ్రౌన్ టర్కీ రకాలున్నాయి. అంజీర పండ్లు, డ్రై ఫ్రూట్స్ రకాలు ఉంటాయి. ఒక పండు 40 నుంచి 120 గ్రాముల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.2.50లక్షల పెట్టుబడి అవసరం. మార్కెటింగ్ బాగా జరిగితే ఎకరాకు రూ.లక్ష లాభం వస్తుంది. అంజీర కేజీ రూ.150, డ్రై ఫ్రూట్ రూ.1,000 ప్రకారం విక్రయించవచ్చు. లాభాలు రావాలంటే పండించిన పంటను కోల్డ్ స్టోరేజీలో ఉంచి ఎగుమతి చేయాల్సి ఉంటుంది.
నలభై రోగాలకు చెక్
అంజీర పండు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మలబద్దకం పోతుంది. షుగర్, బీపీ కంట్రోల్ చేయడంతోపాటు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. దృష్టిలోపాలను నివారిస్తుంది. మొలల వ్యాధి తగ్గుతుంది. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. రక్తం వృద్ధి చెందుతుంది. వృద్ధ్యాప్య లక్షణాలు తగ్గుతాయి. శక్తిని వేగంగా అందిస్తాయి. క్యాన్సర్ గడ్డలను తగ్గిస్తుంది. షుగర్, ఆస్తమా, ఊపిరితిత్తుల, లైంగిక, మానసిక సమస్యలు తగ్గుతాయి. బరువు పెరగడానికి, ఎముకలు బలపడటానికి, నిద్రలేమికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
పంట విక్రయించే విధానం..
వడ్డేపల్లి మండలంలోని రైతులు జిల్లెడదిన్నె శేషిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, రామాపురం వినోద్బాబు, చాణేశ్వర్రెడ్డి, చింతలక్యాంపు బసవ నాగేంద్ర, సీతారామయ్య అంజీర పంట సాగు చేస్తున్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 15 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. పండించిన పంటను కర్నూలు, హైదరాబాద్, బెంగళూర్, చెన్నైలో (డ్రై ఫ్రూట్స్) కేజీ రూ.వెయ్యి ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ విషయంలో రాష్ట్రంలోనే వడ్డేపల్లి మండలం రెండోస్థానంలో నిలిచింది. ప్రభుత్వ సహకారం అవసరమని, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.
విదేశాల్లో విక్రయించాం
ఉమ్మడిజిల్లాలో మొట్టమొదటగా అంజీర ఎగుమతులు జిల్లెడదిన్నె గ్రామం నుంచే మొదలయ్యాయి. ప్రస్తుతం అంజీర ఎగుమతిలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నాం. పంట నిలువ ఉంచడానికి కోల్డ్ స్టోరేజీ అవసరం. సుమారు రూ.40లక్షలతో మహారాష్ట్రలోని పుణె నుంచి కోల్డ్ స్టోరేజీ తెప్పించాను. అలాగే కోల్డ్ వ్యాన్, ప్యాకింగ్ మెటీరియల్ సమకూర్చుకున్నాను. బెంగళూర్, కర్నూలు, ఖతర్, దుబాయ్ దేశాలకు పంటను విక్రయించా. బాంబే, ఢిల్లీ ఇలా ఎక్కడికైనా ఎగుమతి చేసుకునే వీలుంటుంది. అంజీర మార్కెటింగ్ సరిగ్గా చేసుకుంటే ఎకరాకు రూ.లక్ష లాభం వస్తుంది.
– రాధాకృష్ణా రెడ్డి , జిల్లెడదిన్నె రైతు
హార్టికల్చర్ సాగుపై అవగాహన పెంచాలి
అంజీర పంటను వడ్డేపల్లి, ఆత్మకూరు మండలాల్లో మాత్రమే సాగుచేస్తున్నారు. హార్టికల్చర్ పంటల సాగుపై జిల్లాలో రైతులకు అవగాహన కల్పించాలి. లాభదాయకమైన కొత్తరకం పంటల దిగుమతి, ఎగుమతి విషయాల్లో ప్రభుత్వ సహకారం కావాలి. కోల్డ్ స్టోరేజీ, మార్కెటింగ్ కోసం, పంటకు సబ్సిడీ, పెట్టుబడిని ప్రభుత్వం అందించాలి.
– చాణేశ్వర్రెడ్డి, జిల్లెడదిన్నె