మహబూబ్ నగర్: పాలమూరులో వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ వేగంగా సాగుతోంది. గత 2 రోజులుగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ నెలాఖరు నాటికి 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లు, గ్రామ స్థాయి కమిటీలు కష్టపడి పని చేస్తున్నాయి.
మండల స్థాయి నోడల్ అధికారులు కోవిడ్ బాధ్యతలను చేపట్టారు. వారంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. కలెక్టర్ వెంకట్ రావుతో పాటు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, పవర్-రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఇతర అధికారులు విస్తృతంగా జిల్లాలో పర్యటించి ఎప్పటికప్పుడు వాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
వాక్సినేషన్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 16,287 మందికి మొదటి డోసు.. 4,572 మందికి రెండో డోసు వేశారు. ఈ నెలాఖరు నాటికి 100శాతం లక్ష్యాన్ని సాధించాలన్న ఉద్దేశంతో రాత్రి పూట కూడా వ్యాక్సినేషన్ చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్ రావు తెలిపారు. ఇందుకుగాను అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.