సిటీబ్యూరో, ఆగస్ట్ 15 (నమస్తే తెలంగాణ): సొంత ఆస్తులు, స్థలాలపై బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మించి, ఆ సేల్ డీడ్ కాగితాలను మూడో వ్యక్తికి బదిలీ చేసి కోట్లాది రూపాయల మేర ఘరానా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా కొండాపూర్కు చెందిన యుగంధర్ కాగా 2016 నుంచి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో 20కి పైగా క్రిమినల్, సివిల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల విచారణలో యుగంధర్ వేర్వేరు వ్యక్తులకు సంబంధించిన ఆస్తులపై రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మించి ఇప్పటివరకు రూ.10కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలిందని చెప్పారు. యుగంధర్ పై ఫిర్యాదు చేసిన వ్యక్తికి అతను రూ.60 లక్షల ఆర్థిక సాయం అందించిన నిందితుడు ఆ ఆస్తిని వేరొకరికి విక్రయించనని ఒప్పందం చేసుకుని సేల్డీడ్ రాయించుకున్నారు.
అయితే ఫిర్యాదుదారునికి తెలియకుండానే ఆ సేల్డీడ్ను దుర్వినియోగం చేస్తూ ఆ ఆస్తిని మూడో వ్యక్తి పేరిట మార్చేశాడు. ఆ తర్వాత ఆ ఆస్తిని కుదువబెట్టి యాక్సిస్ బ్యాంక్ నుంచి సుమారు రూ.1.50కోట్ల రుణం పొంది, డిఫాల్ట్ అయ్యాడు. బ్యాంక్ అధికారులు రుణం చెల్లించాలని ఫిర్యాదుదారునికి నోటీసులు పంపడంతో నిందితుడి మోసం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత సీసీఎస్ డీసీపీ పర్యవేక్షణలో ఏసీపీ కిరణ్, ఎస్ఐ అనిల్కుమార్ నిందితుడిని పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.