నారాయణపేట, మార్చి 13: మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు కొనసాగగా.., ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ రానురానూ పుంజుకుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల పార్టీలు శిబిరాలు ఏర్పాటు చేసుకొని తాము బలపర్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కోరడం కనిపించింది. జిల్లాలో కోస్గి, మద్దూర్, నారాయణపేట, మరికల్, మక్తల్ మండలకేంద్రాల్లో మొత్తం 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 664 మంది ఉపాధ్యాయ ఓటర్లకుగానూ 618 మంది ఓటుహక్కును వినియోగించుకోగా 93.92శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఇందులో 392 మంది పురుష ఓటర్లు ఉండగా, 226 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కోస్గి పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 97.67శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, మరికల్లో అత్యల్పంగా 88.68 పోలింగ్ శాతం నమోదైంది. పలు పోలింగ్ కేంద్రాలను అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఆర్డీవో రాంచందర్ సందర్శించారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ వెంకటేశ్వర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఎస్కార్ట్ సహాయంతో హైదరాబాద్లోని రిసిప్షన్ సెంటర్కు తరలించారు.
మక్తల్ టౌన్, మార్చి13: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిల్లో భాగంగా సోమవారం మక్తల్ల్లో 92శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి శ్రీధర్ తెలిపారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన 49వ పోలింగ్ బూత్లో మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాల్లోని 135మంది ఓటర్లు ఉండగా.. 125మంది ఉపాధ్యాయులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో 65మంది పురుషులు, 60మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ సరళిని పేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ పరిశీలించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు బూత్ వద్ద ఇతర వ్యక్తులు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. అలాగే ఎన్నికల సరళిని నారాయణపేట ఆర్డీవో రాంచందర్ పర్యవేక్షించారు. సీఐ సీతయ్య, ఎస్సై పర్వతాలు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరికల్(ధన్వాడ), మార్చి 13: మరికల్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోలింగ్ బూత్ 48లో 53 ఓటర్లు ఉండగా 47 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ పోలింగ్ కేంద్రాన్ని పేట ఆర్డీవో రాంచందర్, అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ పరిశీలించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మరికల్ సీఐ శ్రీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో మరికల్ ఎస్సై అశోక్బాబు, ధన్వాడ ఎస్సై రమేశ్, నర్వ ఏఎస్సై రాజేశ్, శంకరయ్యతో పాటు పోలీసులు బందోబస్త్తు నిర్వహించారు. మొత్తం 34 మంది పురుషులకుగానూ 33మంది, 19మంది మహిళా ఓటర్లకుగానూ 14మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.
మద్దూర్(కొత్తపల్లి), మార్చి 13: మద్దూర్ మండలకేంద్రంలోని బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 46పోలింగ్ బూత్లో 43మంది ఓటర్లుగానూ 40మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 13 మహిళా ఓటర్లు వందశాతం ఓటు వేయగా.. 30మంది పురుషులకు 27మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఒకరు భూత్పర్లో వినియోగించుకున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఎస్పీ సత్యనారాయణ పోలింగ్ బూత్ను పర్యవేక్షించారు.
కోస్గి, మార్చి13: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉపాధ్యాయులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. కోస్గిలో 86ఓట్లు ఉండగా 84 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, డీఎస్పీ సత్యనారాయణ పరిశీలించారు. 97.67శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి శివకుమార్ తెలిపారు.