మహబూబ్నగర్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అకాల వర్షాలు రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈదురు గాలులకుతోడు వర్షం కురవడంతో ఆరబోసిన మక్కలు, ధాన్యం తడిచిపోయింది. నాగర్కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, ఖిల్లాఘణపురం, కొత్తకోట, రాజోళి, మహబూబ్నగర్లో వాన పడింది. నవాబ్పేట, ఆత్మకూరులో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు.
కొందరు టార్ఫాలిన్లు కప్పి పంటను కాపాడుకోగా.. మరికొందరు కవర్లు కప్పేలోగా వర్షార్పణమైంది. ఇన్నాళ్లు చేసిన కష్టమంతా నీటి పాలైందని దిగాలు చెందారు. వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకు నేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. యార్డుల్లో వరి, మక్కను 20రోజులుగా కాపాడుకుంటూ వస్తే.. చివరకు వరుణదేవుడు తమను నిండా ముంచాడని ఆవేదన చెందారు. కష్టపడి పండించిన పంటను తృప్తిగా అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

పలు చోట్ల ఈదురుగాలుల బీభత్సం
ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మహబూబ్నగర్ బైపాస్, రహదారుల వెంట ఉన్న చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. కలెక్టర్ కార్యాలయం సమీపంలో నిర్మించిన బస్టాండ్ కొట్టుకుపోయింది. పిస్తా హౌస్ సమీపంలో కారుపై చెట్టు పడింది. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ గాలి దుమారం రేగింది.
