అయిజ, మే 29 : ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయిజ మున్సిపాలిటీలోని పలు కాలనీలు వర్షం నీటితో నిండిపోయాయి. రాయిచూర్ రహదారిలోని ఓ కాలనీ వరద నీటితో ముంచెత్తింది. బుడగ జంగాల కాలనీకి చెందిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాయిచూర్ రహదారిపై ఉన్న కల్వర్టు ఆక్రమణకు గురై మూసుకుపోవడంతో వాన నీరు వాగులు, వంకలకు చేరకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పులికల్ గ్రామ పంచాయతీ ఆవరణలోని చెట్లు కూలగ ఉత్తనూర్ సమీపంలోని గంగమ్మ వాగు పొంగి పొర్లింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో చెట్టు కూలి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మండల వ్యాప్తంగా 38.8 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఉప్పునుంతల, మే 29 : ఉప్పునుంతల మండలంలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఉప్పరిపల్లి, తాడూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కురిసిన భారీ వర్షానికి కంసానిపల్లి మహాసముద్రం చెరువు నిండి అలుగు పారుతున్నది. వడ్లగండ్లతో వర్షం పడడం వల్ల వరిచేళ్లకు కొంత నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ముఖ్యంగా తాడూర్- ఉప్పునుంతల ప్రధాన రహదారిలో 33 కేవీ లైన్ తెగిపడి స్తంభాలు రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. మూడురోజులుగా రైతులు నాటిన పత్తి విత్తనాలు కొట్టుకపోయాయి.
తెలకపల్లి, మే 29 : మండలంలో శుక్రవారం తెల్లవారుజామున వీచిన ఈదురుగాలులకు వివిధ గ్రామాల్లో పెద్ద వృక్షాలు రోడ్లపై అడ్డంగా విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని ఆలేరు గ్రామంలో బత్తుల బక్కయ్య కొత్తగా ఇల్లు నిర్మాణం చేపట్టగా ఈదురు గాలులకు కొత్త ఇంటిపై రేలింగ్ కూలిపోయింది. అలాగే బత్తుల శేఖర్ పైకప్పు రేలింగ్ పగిలింది. అలాగే బత్తుల ఈశ్వరమ్మ రేకుల ఇల్లు పైకప్పు ఎగిరిపోయాయి. అలాగే బీరకాల మశన్న పూరి గుడిసెకు ఇరువైపులా గోడలు కూలడంతో ప్రమాదం తప్పింది.
గ్రామంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు పాఠ శాలలో పెద్ద పెద్ద వృక్షాలు విరిగిపోయాయి. గౌరెడ్డిపల్లి, పెద్దూరు మధ్యన రోడ్లపై పడిన చెట్లను పోలీసులు తొలగించగా, ఈదురుగాలులతో విరిగిపోయిన స్తంభాలకు విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపడుతున్నారు.