అలంపూర్/హన్వాడ, ఏప్రిల్ 17 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు రాగా, ఉమ్మడి జిల్లాకే రెండు దక్కాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామ పంచాయతీ అద్భుత ఆదర్శప్రాయ పరిపాలన విభాగంలో సత్తా చాటింది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామ పంచాయతీ వంద శాతం సామాజిక భద్రత సాధించింది.
ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ఉత్తమ పంచాయతీల జాతీయ పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా మాన్దొడ్డి, కొనగట్టుపల్లి సర్పంచులు సవారి, మానస అందుకున్నారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల అదనపు కలెక్టర్ అపూర్వచౌహాన్, డీపీవో శ్యామ్ సుందర్, మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ సీతారామరావు, డీపీవో వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యదర్శులు దస్తగిరి, శ్రీనివాసులు ఉన్నారు.