వ్యాధుల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా.. కొన్ని రోగాలు చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉన్నాయి. అలాంటి రోగాల్లో ఒకటి క్షయ. పరిసరాలు శుభ్రంగా లేకపోయినా.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోయినా.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా ఇట్టే వ్యాపిస్తుంది.. అయితే ముందస్తు జాగ్రత్తలతో ఈ వ్యాధిని అరికట్టవచ్చు.. మన దరి చేరకుండా తరిమేయవచ్చు. క్షయకు చెక్ పెట్టేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. క్షయ నిర్మూలనకు చేపడుతున్న చర్యల్లో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
– గద్వాలటౌన్, ఏప్రిల్ 20
అపరిశుభ్రత, కాలుష్యం వల్ల వచ్చే రోగాల్లో అతి ప్రమాదకరమైంది క్షయ. ఈ వ్యాధి ట్యూబ ర్ క్యూలోసిన్ అనే మైక్రోబ్యాక్టీరియాతో వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి కాకుండా కలుషితమైన నీరు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లు తదితర వాహకాలతో వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. వ్యాధి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది.
వ్యాధి మూడు రకాలు
క్షయవ్యాధిని మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది కళ్ల (తెమడ)లో క్రిమి కనబడే ఊపిరితిత్తుల క్షయవ్యాధి. ఈ వ్యాధి 90శాతం ఉంటుం ది. రెండోరకం తెమడలో క్రిమిలేని ఊపిరితిత్తుల క్షయ. మూడోరకం వివిధ భాగాలకు సోకే క్షయ. ఇలా మూడు రకాలుగా ఉంటుంది. వ్యాధిని గు ర్తించేందుకు జిల్లాలో ప్రత్యేక పరీక్షా యంత్రాలను సమకూర్చారు.
అందుబాటులో అధునాతన పరికరాలు
ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేనివిధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో పరీక్షల నిమిత్తం అధునాతన పరికారాలను ఏర్పాటు చేశారు. ఒకేసారి 24 శాంపీల్స్కు పరీక్షలు చేసేవిధంగా పరికరాలు ఉన్నాయి. రెండు ట్రూనాట్ పరికరాలు ఉండగా, 8మంది నమూనాలకు పరీక్షలు చేయవచ్చు,
అలాగే సీబీ నాట్లో ఒకేసారి 16మంది నమూనాలకు పరీక్షలు నిర్వహించవచ్చు. మొత్తం ఇలా 24మంది నమూనాల పరీక్షలు చేయవచ్చు. ఇందుకు 2గంటల సమయం పడుతుంది.
ఇగ్రా పరీక్షలు..
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇగ్రా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇగ్రా అంటే వ్యాధి సోకకముందే పసిగట్టి సదరు వ్యక్తికి చికిత్స అందించడం. ఈ పరీక్షలు మైక్రోబాక్టీరియం, క్షయ రోగనిరోధక ప్రతిస్పందనను కొ లుస్తాయి. గల్ల పరీక్ష పాజిటివ్ ఉన్న వారి కుటుంబసభ్యులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల ముందస్తుగా ఇన్ఫెక్షన్ను గుర్తించి టీబీగా మారకముందే చికిత్స అందించేందుకు ఈ పరీక్షలు ఎం తో దోహదపడతాయి. ఇలా ఇప్పటివరకు 300 మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. అందులో 97మందికి ఇన్ఫెక్షన్ సోకినట్లు తేల్చారు. ప్రస్తు తం వారికి ముందస్తు చికిత్స అందిస్తున్నారు.
నిక్షయ్ మిత్ర..
నిరుపేద వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకుగా నూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం నిక్షయ్మిత్ర. పథకం కింద ఏదైనా స్వచ్ఛంద సంస్థ కానీ.. సామాజికవేత్తలు కానీ వ్యాధి సోకిన వారిని దత్తత తీసుకుని చికిత్స అందించవచ్చు. అంటే ప్రతినెలా వారి పౌష్టికాహారానికి అయ్యే ఖర్చు దాతలే భరించాల్సి ఉంటుంది. ఇలా సదరు రోగి జబ్బు నయమయ్యే వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే డబ్బు రూపేనా కాకుండా సరుకుల రూపంలో ఇవ్వడం ఉత్తమం. ప్రస్తుతం జిల్లాలో 21మంది ముందుకు వచ్చి రోగులను దత్తత తీసుకుని వారి కి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
వైద్యం ఇలా…
వ్యాధిగ్రస్తులను గుర్తించిన తర్వాత కొత్త వారికి 6నెలల కోర్సు, రోగం తిరగబడిన వారికి 8నెలలు, వ్యాధి ముదిరిన వారికి రెండేండ్ల కోర్సు ఇస్తున్నారు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు మందులను పంపిణీ చేస్తారు. ప్రతి రోగికి సోమ, బుధ, శుక్రవారాల్లో మందులను అందిస్తున్నారు. ఈ మందులను క్రమం తప్పకుండా వాడాలి. రెండు, మూడు వారాలు మందులను వాడిన తర్వాత కోర్సును మారుస్తారు. మందులు వాడకుండా ఆపేస్తే మరో 6నెలల వరకు అదనంగా కోర్సును పొడిగిస్తారు.
వ్యాధిగ్రస్తులకు ఆర్థికసాయం..
క్షయ బారిన పడిన పేదలకు ప్రభుత్వం చే యూత అందిస్తున్నది. బాధితులు చికిత్స కోసం ముందుకొచ్చేలా ఉచిత మందులతోపాటు పౌష్టికాహరం నిమిత్తం ప్రతినెలా రూ.500 రోగి బ్యాం కు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్నది. అలాగే రోగం గుర్తించిన వారికి సైతం ప్రోత్సాహక బహుమతి అందజేస్తున్నది. ఆ మేరకు జిల్లాలోని వ్యాధి గ్రస్తులందరికీ పౌష్టికాహారం నిమిత్తం ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇప్పటివరకు 1502మందికి రూ.34లక్షల 36వేలు అందజేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
పెరుతున్న వ్యాధి..
జిల్లాలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గతేడాది మొత్తం 1502మంది క్షయ బాధితులు ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 20వరకు 401మందికి వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అంటే కేవలం 80 రోజుల్లోనే 401మంది, అంటే రోజుకు నలుగురు నుంచి ఐదుగురు వరకు క్షయ బారిన పడుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇందుకు క్షయ వ్యాధిగ్రస్తుడు నిర్దారణ పరీక్షలు చేయించుకోకపోవడం ఒకటైతే, వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు మందులు వాడకపోవడం మరో కారణమని అధికారులు చెబుతున్నా రు. వ్యాధిగ్రస్తులు మందులు పూర్తిగా వాడకపోవడంతో వ్యాధి తిరగబడి ఇతరులకు సోకే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి..
క్షయపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తి గత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. వ్యాధిగ్రస్తులు రోగం నయమయ్యే వరకు మందులు వాడాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రుమాలును అడ్డుగా పెట్టుకోవాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.
రాష్ట్రంలోనే మొదటి స్థానం..
క్షయ వ్యాధిగ్రస్తులకు సకాలంలో పరీక్షలు ని ర్వహించడం, మందులను పంపిణీ చేయడం, రోగులకు అవగాహన కల్పించడం, ఇలా పలు సేవల్లో రాష్ట్రంలోనే జోగుళాంబ గద్వాల జిల్లా వైద్యారోగ్యశాఖ మొదటి స్థానంలో నిలచింది. అలాగే అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. అలాగే పౌ ష్టికాహారం నిమిత్తం ప్రతినెలా రోగులకు అందజేస్తున్న రూ.500 పంపిణీలో కూడా రాష్ట్రంలో మొ దటిస్థానంలో జిల్లా వైద్యారోగ్యశాఖ నిలిచింది.
సమిష్టి కృషి అవసరం
టీబీ నివారణలో సమిష్టి కృషి అవసరం. ఇప్పటికే జిల్లాలో టీబీ నివారణ చర్యలను విస్తృ తం చేశాం. ఇందులో భా గంగా పరీక్షల నిమిత్తం అధునాతన పరికరాలను ఏర్పాటు చేశాం. రోగులకు మంచి మందులతోపాటు పౌష్టికాహారం నిమిత్తం ప్రతినెలా రూ.500 అందజేస్తున్నాం. అంతేగాక నిక్షయ్మిత్రతో రోగులను పలువురు దత్తత తీసుకొని జబ్బు నయమయ్యే వరకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 21మంది దాతలు ముందుకొచ్చారు. వైద్యారోగ్యశాఖతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దవచ్చు.
– డాక్టర్ సిద్ధప్ప, డిప్యూటీ డీఎంహెచ్వో, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్