నాగర్కర్నూల్, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : టీఎస్పీఎస్సీ ఉద్యోగాల కల్పనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నది. పైరవీలకు తావు లేకుండా, పార్టీల ప్రమేయం లేకుండా కొలువులను అందిస్తున్నది. ఇటీవలే పూర్తయిన గ్రూప్-1తో పాటు 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవడంతో ఉద్యోగార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిభే కొలమానంగా..
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నది. 2014నుంచి ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 8 ఏండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు పొందిన యువత ఇప్పుడు పలు శాఖల్లో ఉద్యోగులుగా, అధికారులుగా సేవలందిస్తున్నారు. టీఎస్పీఎస్సీ గతానికి భిన్నంగా ప్రతిభకు పెద్దపీట వేసింది. ఇంతకముందు గ్రూప్ పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని తొలగించింది. దీంతో పైరవీలకు, డబ్బులతో ఉద్యోగం కొనుక్కునే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నది. దీని వల్ల గ్రామీణ యువత సైతం మెరిట్ మార్కులతో పలు ఉద్యోగాలను సాధించారు. వివాదాలు లేకుండా ఇప్పటివరకు టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల భర్తీ జరిగింది. రాజకీయాలతో సంబంధం లేకుండా కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తల కుటుంబాల్లోని బిడ్డలకు సైతం ఉద్యోగాలు దక్కాయి. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల కల్పనను చేపడుతుందనడానికి ఇదే నిదర్శనం.
ఈ క్రమంలో ఇటీవల బీజేపీ కార్యకర్త టీఎస్పీఎస్సీ ఉద్యోగ నియామక ప్రశ్నాపత్రాల లీకేజీలో దొరకడం రాష్ట్రంలో సంలచనంగా మారింది. నియామకాల ప్రక్రియను వందశాతం సాధించే క్రమంలో ఇటీవలే గ్రూప్-1,2,3,4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు. ఉద్యోగాల భర్తీతో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ చర్యలకు పాల్పడుతుందని మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు, నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ కొలువులు వస్తాయనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలని పలువురు పేర్కొంటున్నారు. దీనిని విస్మరించిన ప్రతిపక్షాలు (బీజేపీ, కాంగ్రెస్) కొలువుల భర్తీని అడ్డుకునేందుకు ఆందోళనలు చేయడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆలోచనతో ముందుకు సాగుతున్న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లను అడ్డుకోవడంపై అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష నాయకులు, నిరుద్యోగ యువత ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభ ఆధారంగానే నియామకాలు
ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ వేస్తే కష్టపడి చదివి పరీక్ష రాశాను. ప్రతిభ ఆధారంగా ప్రభుత్వం నియామకం చేపట్టింది. 2015 డిసెంబర్లో టీఎస్పీఎస్సీలో 311 ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2016 ఏప్రిల్లో మరో వెయ్యి ఏఈవో పోస్టులకు రాత పరీక్షకోసం దరఖాస్తులను ఆహ్వానించింది. 2017 అక్టోబర్లో కూడా 851 పోస్టులు వేసింది. 2016 ఏప్రిల్లో నోటిఫికేషన్ వేసి పరీక్షలో ప్రతిభ ఆధారంగా 2017జనవరిలో నన్ను ఏఈవోగా నియమించింది. ప్రభుత్వం ఉద్యోగం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది.
– ఎల్.సుధారాణి, ఏఈవో, కొల్లాపూర్