తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా నిలిచింది. సానుభూతిపరులు, పార్టీ నాయకులనే లబ్ధిదారులుగా గుర్తించి అందలం ఎక్కించిన సమైక్య రాష్ట్ర పరిస్థితులకు చరమగీతం పాడింది. ఇతర పార్టీల నేతలైనా సరే ఇంటికి వెళ్లి మరీ లబ్ధిదారులకు సాయం అందించి మేమున్నామంటూ భరోసానిచ్చారు టీఆర్ఎస్ నేతలు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పాదయాత్ర పసలేకుండా సాగిన విషయం తెలిసిందే. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం తమకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెబుతుండడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పొచ్చు.
మహబూబ్నగర్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ పథకాలు అందేలా చూస్తూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్వన్గా నిలిచింది. పార్టీ నాయకులు, సానుభూతిపరులు, తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే సమైక్య రాష్ట్రంలో వివిధ పథకాలు అందేవి. పింఛన్ కావాలన్నా వారి పార్టీ నాయకులు సిఫార్సు చేస్తే తప్పా అవకాశం ఉండేది కాదు. ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పథకాలు ఏవైనా సరే గత పాలకులు తమకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే అందేలా చేసేవారు. స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. అస్మదీయులు, తస్మదీయులు అనే తేడా లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, దళిత బంధు.. ఇలా ఒక్కటేమిటి తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం కేవలం అర్హత ఆధారంగా మాత్రమే లభిస్తున్నది. కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఓవైపు.. కేవలం పసలేని విమర్శలు చేసే ప్రతిపక్షాలు మరోవైపు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ.. ఇలా పార్టీలు ఏవైనా అర్హులైతే చాలు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర పేరిట షో చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రజల నుంచి కనీసం స్పందన లేదు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం తమకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెబుతుండడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా చెప్పొచ్చు.
బీజేపీ యువ నేతకూ రూ.లక్ష సీఎమ్మార్ఎఫ్..
టీఆర్ఎస్ సర్కార్ హయాంలో పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయనడానికి నిలువెత్తు సాక్ష్యం ఇది. రూ.లక్షల విలువ చేసే సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేసినా.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దరిచేర్చినా.. అది ఉద్యమ పార్టీకే చెల్లింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బీజేపీ యువ నేతకు సీఎమ్మార్ఎఫ్ నిధులు మంజూరు చేసి అండగా నిలిచారు. బీజేపీ దేవరకద్ర మండల ప్రధాన కార్యదర్శి రాచాల రాజుకు ఏప్రిల్ 8న రూ.లక్ష సీఎమ్మార్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే ఆల అందజేశారు. రాజు మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదం లో గాయపడి చికిత్స పొందగా.. విషయం తెలిసిన ఎమ్మెల్యే సీఎం సహాయనిధి నుంచి రూ.లక్ష చెక్కు మంజూరు చేయించారు. అలాగే రాజుకు ఉన్న రెండెకరాల పొలానికి రైతుబం ధు సాయం కూడా అందుతున్నది. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందడం అభినందనీయమని రాజు అన్నారు.
– దేవరకద్ర రూరల్, మే 16
కల్యాణలక్ష్మి వచ్చింది..
నాకు 3ఎకరాల పొలం ఉన్నది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయంగా రూ.15వేల చొప్పున ఏడాదిలోరెండుసార్లు వస్తున్నాయి. ఇటీవల నా కూతురు పెండ్లి చేయగా కల్యాణలక్ష్మి ద్వారా రూ.1,00,116 మంజూరు చేసింది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు పథకాలను అందించడం గొప్ప విషయం.. – ఇస్లావత్ అంజ్యానాయక్, బీజేపీ సీనియర్ కార్యకర్త, కొట్ర, వెల్దండ మండలం
నాకూ రైతుబంధు వస్తున్నది..
మా కుటుంబానికి ఎనిమిదెకరాలు ఉన్నది. 2018 నుంచి ఏడాదికి రెండు విడుతల్లో రైతుబంధు డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. నేను వేరే పార్టీ అయినా సరే.. రాష్ట్ర సర్కార్ రైతుబంధు డబ్బులు ఇవ్వడం అభినందనీయం. ఈ పథకాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఏడాదికి మూడు విడుతలుగా రూ.6వేలు అందిస్తున్నది. మా నాయనమ్మకు వితంతు పింఛన్ కూడా వచ్చేది. ఆమె చనిపోయింది. రైతుబంధు పథకంతో అన్నదాతలకు ఎంతో మేలు కలుగుతున్నది.
– కొండెమోని శ్రీనివాస్, బీజేపీ కార్యకర్త, సింగారం గ్రామం, అచ్చంపేట మండలం
అమ్మ, వదినకు వితంతు పింఛన్..
తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పిం ఛన్లలో భాగంగా మా అమ్మ చాకలి చిన్న వీర మ్మ, వదిన శారదకు వితంతు పింఛన్ వస్తున్నది. అలాగే మా అమ్మ పేరు మీద ఉన్న భూమికి రైతుబంధు డబ్బులు కూడా వచ్చా యి. ఇటీవలే అన్నదమ్ములం భూమి పంచుకున్నాం. వచ్చే విడుతలో రైతుబంధు డబ్బు లు మాకూ వస్తాయి. టీఆర్ఎస్ సర్కార్ పార్టీలకతీతంగా పథకాలను అమలుచేస్తున్నది. – చాకలి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, లోకిరేవు, నవాబ్పేట మండలం
రైతుబంధుతో ఎంతో మేలు..
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పాటుపడుతున్నది. మా తండ్రి నర్సింహారెడ్డి పేరు మీద మూడెకరాలు ఉన్నది. ఏ డాదికి రూ.30 వేలు వస్తున్నాయి. ఈ పథకంతో రైతులకు పెట్టుబడి చాలా ఉపయోగపడుతున్నది. ఎవరి వద్దా చేయి చాపాల్సిన పనిలేదు. పంట వేసే సమయానికి డబ్బులు ఖాతాలో పడుతున్నాయి.
– మాధవరెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, రాజాపూర్
రూ.2 లక్షలకు పైగా వస్తున్నది..
నాకు 20 ఎకరాలకు పైగా భూమి ఉన్నది. రైతుబంధు పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.2 లక్షలకు పైగా వస్తున్నది. ప్రభుత్వం ఉచితంగా పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఆ డబ్బుతో పేదలు ఎవరైనా మృతి చెందితే నాకు తోచిన సాయం చేస్తున్నాను. తెలంగాణ సర్కార్ రైతులకు ఎంతో మేలు చేస్తున్నది.
– రమేశ్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, కందూరు, అడ్డాకుల మండలం