తెలంగాణలో గిరిజనులు ఆత్మగౌరవంగా జీవిస్తున్నారు. సర్కార్ పెద్దపీట వేయడంతో గిరి వికాసం కొనసాగు తున్నది. ‘అపన్ తండేమా.. అపన్ రాజ్’ అన్న వారి ఆకాంక్ష నెరవేరింది. పల్లె, పట్టణాలకు దూరంగా ఉన్న గూడాలు, తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. తండాలను జీపీలుగా మార్చాలన్న ఆలోచనకు స్ఫూర్తి నేలబండ తండానే.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పల్లెనిద్ర కోసం బాలానగర్ మండలంలోని ఈ తండాకు రాగా.. స్థానికులు వారి బాధలను విన్నవించారు. దీంతో చలించిన ఉద్యమ నేత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తండాలను పంచాయతీలుగా మారుస్తామని హామీఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్తగా 205 తండాలను జీపీలుగా మార్చారు. పంచాయతీ భవనానికి రూ.20 లక్షలతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తుండడంతో నేడు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. దీంతో గిరిపుత్రులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న గిరిజనోత్సవ పండుగకు తండాలు ముస్తాబయ్యాయి.
మహబూబ్నగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘హమారా తండామే హమారా రాజ్’ నినాదాన్ని ప్రభుత్వం నిజం చేయడంతో గిరిజన తండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. కొండలు.. కోనల్లో పల్లె, పట్టణానికి దూరంగా ఉన్న తండాలు.. ప్రస్తుతం పంచాయతీలుగా మారి పరిపాలనా పగ్గాలు చేపట్టాయి. ఒకప్పుడు కాలినడకే శరణ్యం కాగా.. ఇప్పుడు సీసీ, బీటీరోడ్లతో కళకళలాడుతున్నాయి. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తాగునీళ్లు అందుతున్నాయి. కనీస వసతులు లేక బోసిబోయిన పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు సందడిగా మారాయి. గిరిజనుల చెంతకు రేషన్ దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఎస్టీ సబ్ప్లాన్ అమలుతో నిధుల వరద పారుతున్నది. తెలంగాణ వచ్చాక తండాల రూపురేఖలు మారిపోయాయి. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి. పూరిగుడిసెలు మాయమై డాబా ఇండ్లు దర్శనమిస్తున్నాయి. వ్యవసాయానికి నిరంతర విద్యుత్, పంటసాగుకు పెట్టుబడి సాయం అందడం, చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉండడంతో పుష్కలంగా పంటలు పండిస్తూ పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ తండాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. తండాల్లో తమను రాజులాగా చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం సంప్రదాయ పద్ధతుల్లో గిరిజనోత్సవం జరుపుకొనేందుకు సన్నద్ధమయ్యారు. తండాలను పంచాయతీలుగా చేయాలనే ఆలోచనకు శ్రీకారం పడింది పాలమూరు జిల్లాలోనే కావడం గమనార్హం. తండావాసులు పడుతున్న బాధలను కళ్లారా చూసిన కేసీఆర్.. తెలంగాణ వస్తే తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని బాలానగర్ మండలం నేలబండతండాలో ప్రతిజ్ఞ బూనారు. తెలంగాణ వచ్చాక గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ 500 జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా మారుస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా హమారా రాజ్ హమారా తండా అనే నినాదం మార్మోగింది. అనేక తండాల్లో ఎన్నిక ఏకగ్రీవమై సీఎం కేసీఆర్కు బాసటగా నిలిచాయి. గిరిజనుల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేయడంతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
గ్రామాలు, పట్టణాలకు విసిరేసినట్లు ఉండే తండాలను పంచాయతీలుగా మార్చాలనే డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉంది. గిరిజనుల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ 2019లో 205 తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మారుస్త్తూ నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 77, నారాయణపేటలో 36, నాగర్కర్నూల్లో 53, వనపర్తిలో 33, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆరు తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. 2019లో అన్ని పంచాయతీలతోపాటు నూతన జీపీలకు కూడా ఎన్నికలు నిర్వహించగా, దాదాపు 50శాతం తండాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. చిరకాల వాంఛను నెరవేర్చిన బీఆర్ఎస్కు జై కొట్టాయి.
తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనకు సాక్ష్యంగా నిలిచింది నేలబండతండా. ఉద్యమ సమయంలో బాలానగర్ మండలం నేలబండతండాలో పల్లెనిద్ర కార్యక్రమానికి కేసీఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి వచ్చారు. తండాలోనే ఓ ఇంట్లో బసకు ఏర్పాటు చేశారు. చిమ్మచీకటి..కరెంట్ఎప్పుడొస్తదో తెలియదు. చిమ్నీలు పట్టుకుని కేసీఆర్ను చూడడానికి వచ్చారు. రాత్రి పొద్దుపోయే వరకు లంబా డ నేతలతో సమాలోచనలు చేశారు. తండాలు మారాలంటే ఏం చేయాలనే దానిపై విస్తృత చర్చ జరిగింది. తండాల్లో జనాభా తక్కువ..పంచాయతీలుగా చేయాలనే డిమాండ్ సాధ్యమవుతదా అనే అనుమానం.. పొద్దున లేచే సరికి తండా జనం మొత్తం కేసీఆర్ బస చేస్తున్న ఇంటి వద్ద ప్రత్యక్షమైంది. తండాల్లో నెలకొన్న ఇబ్బందులను తెలుసుకున్న కేసీఆర్ చలించిపోయారు. తెలంగాణ వస్తే తండాలను పంచాయతీలుగా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇచ్చి న మాటకు కట్టుబడి తెలంగాణ వచ్చాక తండాలను జీపీలుగా ఏర్పాటు చేశారు. కేసీఆర్ పాలమూరు ఎంపీగా తెలంగాణ సాధిస్తే.. తండాలను పంచాయతీలుగా చేస్తానని నేలబండతండాలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయ్యాక చేసి చూపించారని, అది కేసీఆర్కే సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజనోత్సవాలకు ప్రభుత్వం ఒకరోజు కేటాయించడంతో గిరిజన నేతలు సంబురపడుతున్నారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశాక సాధించిన ప్రగతిని చాటేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్లు పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తండాలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల జీపీ భవన నిర్మాణాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయించింది. కొన్ని జీపీల్లో భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే గిరిజనోత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటుండడంతో తండాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది.
నాగర్కర్నూల్, జూన్ 16 : గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు విద్యా, ఉద్యోగాల్లో 6శాతం ఉన్న రిజర్వేషన్ను 10శాతానికి పెంచడం, 500 కుటుంబాలు ఉన్న తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గిరిజనుల ఆకాంక్ష సాకారమైంది. నాగర్కర్నూల్ జిల్లాలో 53 గిరిజన తండాలు, గూడాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశారు. తండాల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతోపాటు పంచాయతీ భవన నిర్మాణాలకు రూ.20లక్షల చొప్పున నిధులను మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 29 గిరిజన రెసిడెన్షియల్ విద్యాలయాలను ఏర్పాటు చేసి 6,104మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నారు. జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమశాఖ పరిపాలనా అనుమతి ఇచ్చింది. మన్ననూర్, కల్వకుర్తి ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. అంబేద్కర్ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు 10మంది గిరిజన విద్యార్థినీ, విద్యార్థులకు రూ.12కోట్లు మంజూరు చేశారు. షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం 2014-15 నుంచి 2021-22 వరకు 3,253మందికి రూ.38కోట్ల 58లక్షల 49వేల సబ్సిడీ రుణాలను అందజేశారు. గిరివికాసం పథకంతో ఇద్దరు రైతులకంటే ఎక్కువ మందికి 5నుంచి 10 ఎకరాల పొలం ఉంటే ప్రభుత్వం బోరుబావి తవ్వించి పైపులైన్ ఏర్పాటు,న విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నది.గిరిజనుల ఆరాధ్యదైవం భౌరాపూర్ జారతను అధికారికంగా నిర్వహిస్తున్నది.
ఉద్యమనేత కేసీఆర్ సీఎం కాకపోయుంటే గిరిజనుల బతుకులు ఆగమయ్యేవి. తెలంగాణ ఉద్యమ సమయంలో గిరిజనుల కష్టాలు, బాధలు ప్రత్యక్షంగా చూసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయడంతో సమాజంలో తలెత్తుకొని జీవిస్తున్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– సేవ్యానాయక్, సర్పంచ్, కుత్నేపల్లి-బోడగుట్టతండా, రాజాపూర్
లంబాడ గిరిజనుల చిరకాల వాంఛ సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ వచ్చాక తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించారు. మా తండాలో మా రాజ్యం వచ్చింది. ప్రభుత్వం బ్రహ్మాండంగా నిధులు మంజూరు చేస్తున్నది. మా ఊరంచుతండా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మాకు ఇప్పడు నిజంగానే స్వాతంత్య్రం వచ్చినట్లుంది.
-కేతావత్ శంకర్నాయక్, ఊరంచుతండావాసి, నవాబ్పేట