నాగర్కర్నూల్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర హైకోర్టు ఆదేశంతో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో 3వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభం కానున్నది గత జనవరిలో చేపట్టాల్సిన ప్రక్రియ కోర్టు కేసుతో వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యాయ దంపతులకు స్పౌజ్ కేటగిరీలో పాయింట్లను ఇచ్చి, ఉపాధ్యాయ సంఘాల పాయింట్లు పెండింగ్లో ఉంచింది. ఈ నిబంధనల మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు పదోన్నతులు, బదిలీలను చేపట్టేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో పాటుగా సెప్టెంబర్ నెలను కటాఫ్గా తీసుకోవడంతో 8 ఏండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. అలాగే ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెచ్ఎంలు బదిలీల కోసం దరఖాస్తులు చేసుకోనున్నారు.
నాగర్కర్నూల్లో 1,785 దరఖాస్తులు
గత జనవరిలో నాగర్కర్నూల్ జిల్లాలో 3 వేల మంది ఉపాధ్యాయులకుగాను 1,785 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకొన్నారు. కొత్తగా అవకాశం కల్పించనుండటంతో ఈ సంఖ్య 2 వేలకు దాటే అవకాశం లేకపోలేదు. బదిలీల్లో పదవీ విరమణకు మూడేళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు దరఖాస్తులను సవరించుకొనేందుకు కూడా అవకాశం కల్పించడం గమనార్హం. ఇక సెప్టెంబర్ ఒకటి నాటికి 50 ఏళ్లలోపు ఉండి, బాలికల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సైతం బదిలీ కానున్నారు. ఇక ఈ ప్రక్రియను మొత్తం ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. దీనివల్ల ఎలాంటి అక్రమాలకు చోటుండదు. పదోన్నతుల కోసం వందలాది మంది, బదిలీల కోసం వేలాది మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పదేళ్లు సర్వీసు దాటిన ఉపాధ్యాయులు సైతం ఒకే ప్రాంతంలో పని చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అనారోగ్యాలు, వయస్సు పైబడటం, స్పౌజ్ పాయింట్ల కేటాయింపుతో దంపతులైన ఉపాధ్యాయులందరికీ ఈ బదిలీలు ఊరట కల్పించనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 7 వేల మంది ఉపాధ్యాయులకు మేలు
బదిలీలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 7 వేల మంది ఉపాధ్యాయులకు మేలు చేకూరనున్నది గత జనవరిలో నాగర్కర్నూల్లో 1,785 మంది, మహబూబ్నగర్లో 1,751 మంది, వనపర్తిలో 1,212 మంది, జోగుళాంబ గద్వాలలో 1,285 మంది, నారాయణపేట జిల్లాలో 1,060 మంది ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తులు చేసుకొన్నారు. త్వరలో ఎన్నికలకు నోటిఫికేషన్ జరగనుండటంతో వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే పదోన్నతులు, బదిలీలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో 1,785 మంది దరఖాస్తు
నాగర్కర్నూల్ జిల్లాలోని 845 పాఠశాలల్లో మొత్తం 3,390 ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 1,785 మంది పదోన్నతులు, బదిలీల కోసం జనవరిలో దరఖాస్తు చేసుకొన్నారు. సెప్టెంబర్ నెల ప్రకారం బదిలీలు చేపట్టనుండటంతో కొత్తగా ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులు, ఐదేళ్లు పూర్తయిన హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీలు అవుతారు. ఫలితంగా దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈనెల 3న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా
నిర్వహించడం జరుగుతుంది.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్కర్నూల్