ఆత్మకూరు, ఆగస్టు 1 ;విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో గతేడాది తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని ఈ విద్యాసంవత్సరంలో కూడా కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఆగస్టు మొదటి వారంలో తొలిమెట్టుపై మళ్లీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 2నుంచి 8వ తేదీ వరకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో కార్యాకరణ రూపొందించారు. 2,3 తేదీల్లో తెలుగు, ఉర్దూ, 4,5 తేదీల్లో ఇంగ్లిష్, 7,8 తేదీల్లో గణితం సబ్జెక్టులపై శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
మండలానికి ఆరుగురు ఆర్పీలు
రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)తో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఒక్కో మండలానికి ఆరుగురు చొప్పున జిల్లాలోని 13 మండలాలకు 78మంది రీ సోర్స్ పర్సన్లను కేటాయించారు. శిక్షణలో విద్యార్థులకు సులభంగా బొమ్మల రూ పంలో పాఠాలు బోధించడం తదితర అంశాలతోపాటు ఉపాధ్యాయులకు నూతనంగా వచ్చిన హ్యాండ్బుక్స్పై శిక్షణ ఇవ్వనున్నారు. రోజూవారీ బోధన ప్రణాళికలు, పీరియడ్ ప్రణాళికలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం)పై శిక్షణ ఉంటుంది. తరగతి గతిలో 45నిమిషాలు బోధన, 45నిమిషాలు అభ్యాసన కృత్యాల సాధన చేయించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి విద్యార్థులకు కూడా వర్క్బుక్స్ వచ్చాయి.
వీరికే శిక్షణ
ఒక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటే ఇద్దరికి, అదేవిధంగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలల్లో ఒక్కరికీ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాస్థాయిలో నిష్ణాతులకు శిక్షణ పూర్తయ్యింది. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా శిక్షణ అనంతరం వారంలో 5రోజులు విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధన చేయగా 6వ రోజు విద్యార్థులతో మూల్యాంకనం చేయించాల్సి ఉంటుంది. 6రోజులపాటు జరిగే శిక్షణను మండల విద్యాధికారి పర్యవేక్షిస్తారు. వర్షాల కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలు సక్రమంగా కొనసాగలేదు. వారం రోజుల నుంచి వర్షాల కారణంగా సెలవులు కొనసాగిన నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యనిందించే క్రమంలో ఆర్పీలు సైతం శిక్షణకు సిద్ధంగా ఉన్నారు.
మూడు పాఠశాలల్లో శిక్షణ
ఉమ్మడి మండలానికిగానూ 12మంది రిసోర్స్ పర్సన్లు ఆత్మకూరులోనే శిక్షణ ఇవ్వనున్నాం. టీవీలు కలిగిన మూడు పాఠశాలల్లో రెండు మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. రెండు రోజులు తెలుగు, రెండు రోజులు ఇంగ్లిష్, రెండు రోజులు గణితం సబ్జెక్లులపై శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. శిక్షణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– భాస్కర్సింగ్, మండల విద్యాధికారి, ఆత్మకూర్