కల్వకుర్తి, ఫిబ్రవరి 15 : వేరుశనగ ధరలు రోజురోజుకూ నేల చూపులు చూస్తుండడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు, ధర్నాలు చేసినా ధర మాత్రం పెరగడం లేదని.. మార్కెట్కు తీసుకొచ్చిన వేరుశనగను వెనక్కి తీసుకుపోలేక.. ధర వచ్చే వరకు ఇక్కడే ఉంచలేక సతమతమవుతున్నారు. మార్కెట్కు తెచ్చిన పంట ఉత్పత్తులకు కాపలాగా ఉంటే తిండి ఖర్చులు అవుతున్నాయని, ఇంటి వద్ద ఉన్న పాడి, వ్యవసాయ పనులు పాడైపోతుండడంతో ఏ ధర వచ్చినా వి క్రయించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదని అన్నదాతలు వాపోతున్నారు.
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు గురువారం 206 మంది రైతులు 8,130 బస్తాల వేరుశనగను విక్రయానికి తీసుకొచ్చారు. ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు యథావిధిగా టెండర్లు వేసి.. గరిష్ఠంగా రూ.7,009, మధ్యస్తంగా రూ.6,209, కనిష్ఠంగా రూ.4,100 ధర నిర్ణయించారు. ఎక్కువ ధరకు ఒకటి లేదా రెండు క్వింటా ళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారనేది జగమెరిగిన సత్యం. రూ.4,100 నుంచి రూ.5,500కు పలికిన వేరుశనగను వ్యాపారులు కొనుగోలు చేశారు. ధర పెంచమన్నా వ్యాపారులు ఒప్పుకోలేదు. ఆందోళనలు చేస్తే ఫలితం ఉండకపోగా మరిన్ని ఖర్చులు పెరుగుతాయన్న ఉద్దేశంతో చేసిదేమీలేక విక్రయించినట్లు రైతులు తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, సమస్యలను పరిష్కరించడంలో మార్కెట్ పాలకమండలి కృషి చేస్తుంది. వ్యాపారులు, రైతులకు మధ్య అనుసంధానంగా పనిచేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సర్కారు నియమించిన మార్కెట్ పాలకమండళ్లను రద్దు చేసింది. కొత్త వారిని నియమించలేదు. ఈ క్రమంలో రైతులు, వ్యాపారులకు అనుసంధానంగా నిలవాల్సిన బాధ్యత అధికారులు, మార్కెట్ కార్యదర్శిపై ఉన్నది. కానీ మార్కెట్ కార్యదర్శులు వ్యాపారులతో అంటకాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. వ్యాపారులతో సత్సంబంధాల కారణంగా రైతుల పక్షాన మాట్లాడలేకపోతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. వ్యవసాయ మార్కెట్లో కార్యదర్శి పాత్ర ఏమిటనే దానిపై కొత్త నిర్వచనం వినిపిస్తున్నది. మార్కెట్లో లైట్లు వెలిగించడం, మరమ్మతులు చేయించడం వరకే తమ పని అని మార్కెట్ కార్యదర్శులు అంటున్నారని రైతులు విస్తుబోతున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత తమకు లేదని.. కార్యదర్శులే బాహాటంగా చెబుతుండటంతో కాంగ్రెస్ మార్కు పాలన అంటే ఇదేనేమో అని రైతులు అంటున్నారు.
వేరుశనగకు ప్రస్తుతం ఎగుమతులు లేకపోవడం వల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్స్పోర్ట్ లేదని, ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే మేం నష్టపోతామని వ్యాపారులు తమదైన శైలిలో రైతులను దబాయిస్తున్నారు. ఇష్టం ఉంటే అమ్మండి.. లేకపోతే మీ సరుకు మీరు తీసుకుపోండని హెచ్చరిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కాయాకష్టం చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర దేవుడెరుగు.. కనీసం చేసిన కష్టానికైనా ఫలితం రావడంలేదంటున్నారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడివిలాగా తమ బతుకులు తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ విత్తనాల కోసం ఇదే వ్యాపారుల వద్దకు వెళ్తే.. విత్తనం దొరకడం చాలా కష్టంగా ఉంటుందంటూ క్వింటాకు రూ.14వేలకు పైగానే విక్రయించారంటున్నారు. ఎగుమతులు లేకుంటే వ్యాపారులు మార్కెట్కు ఎందుకు వస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.