వనపర్తి రూరల్/మూసాపేట, మే 1 : ఆరుగాలం కష్టించి రైతులు పండించే ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు మిల్ల ర్లు మాత్రం వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో కొందరు మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైస్మిల్లులకు చేరవేస్తుంటే.. వారు మాత్రం తాలు, పొట్టు పేరుతో లోడ్పై 5 క్వింటాళ్ల నుంచి 25 క్విం టాళ్ల వరకు తరుగు తీస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లతో మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించినా మిల్లర్ల ఆగడాలు ఆగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గంలోని రైతులు మిల్లుల ఎదుట బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు మిల్లుల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. తరుగు పేరుపై రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
అంకూరులో ఆందోళన
వనపర్తి మండలం అంకూరుకు చెందిన 50 మంది రైతు లు ఆందోళనకు దిగారు. స్థానిక రైతు ఎద్దుల రామకృష్ణారెడ్డి తనకున్న 10 ఎకరాల పొలంతోపాటు మరో పది ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. 498 క్వింటాళ్లు దిగుబడి రాగా ధాన్యాన్ని గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. ఇతడికి సంబంధించిన 498 క్వింటాళ్ల ధాన్యాన్ని పెబ్బేరు మండలం చెలిమిల్ల వద్ద ఉన్న రైస్మిల్కు తరలించారు. అయితే అక్కడ రెండు లోడ్లు పూర్తి కాగా చివరి డీసీఎం లోడ్లో వచ్చిన 25 క్వింటాళ్లను ఏకంగా తరుగు కింద ఇవ్వాలని మిల్లు యజమాని పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక తిరిగి గ్రామానికి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత రైతు రామకృష్ణారెడ్డితోపాటు స్థానిక రైతులు రోడ్డుపై చేరి ఆందోళనకు దిగారు. ఇంత పెద్ద మొత్తంలో తరుగు తీస్తే తమకేమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసలు తరుగే తీయొద్దని హెచ్చరిస్తుంటే కొందరు మిల్లర్లు మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయం తెలుసుకున్న పీఏసీసీఎస్ చైర్మన్ వెంకట్రావు అక్కడి నుంచే సివిల్ సైప్లె అధికారులతో మాట్లాడి విషయం తెలిపారు. దీంతో వెంటనే ఆయన తరుగుతీస్తే బ్లాక్లిస్టులో పెడ్తామని మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ధాన్యాన్ని ఇతర మిల్లుకు కేటాయించడంతో రైతులు శాంతించారు.
గుడిబండ మిల్లు యజమానిపై ఆగ్రహం
మూసాపేట మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు ధాన్యాన్ని ఐకేపీ, సింగిల్విండో కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. నిబంధనల మేరకు బస్తాలో బ్యాగ్ తూకంతో పాటు మొత్తం 40 కిలోల 600 గ్రామాలు ఉండాలి. సేకరించిన ధాన్యం మిల్లులో అన్లోడ్ అయ్యే సరికి ఒకటి, రెండ్రోజులు పడుతుంది. అందుకే సేకరణ సమయంలోనే 41 కిలో ల 200 గ్రాములు తూకం కన్నా ఎక్కువే వేస్తున్నారు. ఇక్కడి నుంచి అడ్డాకుల మండలం గుడిబండ శివారులోని రామాంజనేయ రైస్ మిల్లుకు తరలించారు. అయితే అక్కడ సమయానుకూలంగా అన్లోడ్ చేయడం లేదు. ఎందుకని మిల్లు యజమానిని రైతులు ప్రశ్నిస్తే తాలు ఉంది, ఒడ్లు ఆరలేదు.. ఇలా కారణాలు చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిజాలాపూర్, దాసరిపల్లి, పోల్కంపల్లి ఇతర గ్రామాల రైతులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు భాస్కర్గౌడ్, జిల్లా డైరెక్టర్ లక్ష్మీనర్సింహయాదవ్, గూపని కొండ య్య, మండల కోప్షన్ సభ్యుడు అబ్దుల్ జమీర్, పోల్కంపల్లి విండో సీఈవో భాస్కర్, సిబ్బంది, వ్యవసాయ అధికారులు రాజేందర్రెడ్డి, శివ, రైతులతో కలిసి రైస్ మిల్లు వద్దకు వెళ్లారు. ఎందుకు వడ్లు అన్లోడ్ చేయడం లేదని యజమాని గురువయ్యను ప్రశ్నించారు. తాలు, ఇతర కారణాలను సాకుగా చెప్పాడు.
అసలు మీకు నామ్స్ మేరకు ఎంత తాలు ఉండాలి, మట్టి పెల్లలు, రంగుమారని వడ్లు ఎంత శాతం ఉండాలని జెడ్పీటీసీ ఇంద్రయ్య ప్రశ్నించాడు. ఇందుకు ఆయన సమాధానమిస్తూ కలెక్టర్ నాకు ఎంత ఉండాలి.. ఎంత తీసుకోవాలన్న అంశం ఏమీ చెప్పలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో వ్యవసాయాధికారి రాజేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రైతులను ఇబ్బందులు పెడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయినా వినకపోవడంతో డీసీఎస్వోకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. నిబంధనల మేరకు ప్రతి బస్తాలో కిలో కంటే ఎక్కువగానే వడ్లు ఉన్నాయని, ఆ లెక్కన అంటే లారీ నుంచి రూ.5నుంచి 10 వేలు రైతుకు నష్టం వస్తుందని, మరో వైపు తరుగు పేరుతో మీరు దోపిడీ చేస్తున్నారని జెడ్పీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 గంటల వాగ్వాదం తర్వాత ధాన్యం అన్లోడ్ చేసేందుకు మిల్లు యజమాని ఒప్పుకొన్నాడు. అనంతరం పక్కనే ఉన్న మరో రైస్ మిల్లు వద్దకు చేరుకొని అక్కడ అలాగే జరుగుతుందని తెలుసుకొని ప్రశ్నించారు. రైతులను దగా చేయొద్దని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న డీసీఎస్వో బాలరాజు, ఎన్ఫోర్స్మెంట్ డీటీలతో ఖాలీద్, యూసుఫ్ అలీ, బాలప్రసాద్, నాగరాజు అక్కడికి చేరుకున్నారు. రైస్ మిల్లు యజమానులతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని డీసీఎస్వో చెప్పారు.
రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
రైతులను రైస్మిలర్లు తరుగు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు. ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని మిల్లర్లకు సూచించాం. ధాన్యంలో తరుగు తీస్తే చర్యలు తప్పవు. మిల్లులను సీజ్ చేయడంతోపాటు బ్లాక్ లిస్టులో పెడతాం. జిల్లాలో ఇప్పటి వరకు 25 వేల టన్నుల ధాన్యం 350 మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. వీరి ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేశాం.
– కొండల్రావు, సివిల్ సైప్లె అధికారి
మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం
జిల్లాలో వ్యవసాయ సహకార, ఐకేపీ, మార్కెటింగ్ శాఖ ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. సేకరించిన ధాన్యం ప్రభుత్వం గుర్తించిన రైస్ మిల్లులకు తరలిస్తున్నాం. అయితే మిల్లు యజమానులు తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ విషయాన్ని మంత్రి నిరంజన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే సహించేది లేదు. రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం..
– వెంకట్రావు, పీఏసీసీఎస్ చైర్మన్, వనపర్తి