రాఖీ పండుగను అనుబంధాలకు ప్రతీకగా జరుపుకోవడం ఆనవాయితీ. శ్రావణ పూర్ణిమను రాఖీ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. తల్లిదండ్రుల తరువాత అంతటి స్థానం ఉన్న అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టేందుకు తోబుట్టువులు తల్లిగారింటికి చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్ల వద్ద సందడి నెలకొన్నది. రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లో దుకాణాలు భారీగా వెలిశాయి. రాఖీలను కొనుగోలు చేసేందుకు మహిళలు బారులుదీరారు. ఈ ఏడాది పర్యావరణ హితంతో కూడిన మట్టి రాఖీలు, చిన్నారుల కోసం చోటాభీం, హనుమాన్, మిక్కీమౌస్, వంటివి అందుబాటులో ఉన్నాయి. స్వీట్లు, బట్టల దుకాణాలు కిటకిటలాడాయి. ఆర్టీసీ అధికారులు పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అలాగే బస్సులో ప్రయాణించిన మహిళలు టికెట్ వెనకాల పేరు, ఫోన్నెంబర్ రాసి బస్టాండ్లో ఏర్పాటు చేసిన డ్రాప్బాక్సులో వేసి లక్కీడ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. ఇలా రీజియన్ పరిధిలో ముగ్గురికి రూ.5.50 లక్షల బహుమతులను అందజేయనున్నారు.
వనపర్తి టౌన్/కందనూలు/బాలానగర్, ఆగస్టు 30 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన అనుబంధం వీరి మధ్య ఉంటుంది. నీకు నేను రక్ష..నాకు నువ్వు రక్ష అంటూ అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరం అన్న. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువుల బాధ్యతలు అన్ననే వ్యవహరించే సాంప్రదాయం కొనసాగుతుంది. అన్నా-చెల్లెలు, అక్కా-తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకొనే ఈ పండుగకు ఎంతో ప్రత్యేక ఉంది.
చారిత్రక నేపథ్యం ఇలా..
పురాణ ఇతిహాసాల్లో రాఖీ గురించి అనేక కథలు ఉన్నాయి. రాక్షసులకు, దేవతలకు జరుగుతున్న యుద్ధంలో రాక్షస సంహారణ చేసే సందర్భంలో ఇంద్రుడు రాక్షసులను సంహరించడం వీలుకాక అమరావతిలో తల దాచుకుంటాడు. ఇంద్రుడి సతి అయిన ఇంద్రాణి రాక్షసుడిని సంహరించడానికి ఇండ్రుడికి ప్రేరణ కలుగజేస్తుంది. అందులో భాగంగా పార్వతి, లక్ష్మీ దేవతామూర్తులు శ్రావణ బౌద్ద రాఖీ పౌర్ణమిన ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంద్రుడికి రాఖీ కట్టి రాక్షసులను సంహరించడానికి పంపించగా, రాక్షసుడిని వధించి దేవతలకు అధిపతిగా ఇంద్రుడు నిలుస్తాడు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నాటి నుంచి రాఖీ పౌర్ణమి జరుపుకొంటారని చరిత్ర చెబుతుంది. అలాగే శ్రీకృష్ణుడు రాక్షసుడిని సంహరించడానికి సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడని, నాటి నుంచి రాఖీ పండుగ ప్రాచుర్యంలో ఉన్నది. మరో చరిత్రలో ప్రపంచాన్ని జయించాలనుకున్న గ్రీకు రాకుమారుడు అలెగ్జాండర్ భారత్పై దండెత్తినప్పుడు జీలం నది ఒడ్డున పురుషోత్తముడితో యుద్ధం జరుగుతున్న సమయంలో అలెగ్జాండర్ భార్య రుక్సానా తన మేలుకోరి భారత ఉపఖండం వాయువ్య భాగాన్ని పాలిస్తున్న రాజు పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్ను ప్రాణాలతో విడిచిపెట్టాడని చరిత్ర చెబుతున్నది. అదేవిధంగా ద్వాపర యుగంలో ఒక సందర్భంలో కృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపది దేవి తన చీర చొంగును చింపి గాయానికి కడుతుంది. దీంతో దానినే రక్షగా పిలుస్తున్నారు.
మార్కెట్లో రాఖీ విక్రయాల సందడి..
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని మార్కెట్లో రాఖీ విక్రయాల సందడి నెలకొంది. అందులో ఈ ఏడాది కొందరు రాఖీల ప్రత్యేకతను చాటుకునేందుకు రాఖీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. విత్తనాలతో కూడిన రాఖీలు బహూకరించగానే అందులో పుష్పాలు మొలకెత్తేలా మార్కెట్లోకి వచ్చాయి. చిన్నపిల్లలకు ఎంతో ఆకర్షణీయమైన చోటాభీం, హనుమాన్, మిక్కీమౌస్, పోకేమాన్, కార్టూన్ బొమ్మల రాఖీలు మార్కెట్లో ఉన్నాయి. అదేవిధంగా మట్టితో కూడిన రాఖీలు అందుబాటులో ఉండగా, రాఖీలను కొనేందుకు మహిళలు బారులుతీరారు.
జంధ్యాల పౌర్ణమి విశిష్టత..
ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్తది ధరిస్తారు. దీన్నే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యజ్ఞోపం పేరుతో పిలుస్తారు. పాలూరికి సోమనాథుడు దీన్ని నూలి పౌర్ణమి అన్నారు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోప వీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి జ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయనం సమయంలో యజ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడుతారు. దీన్ని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణపౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది వదిలేయాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంసారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కడుతూ తమ ఆత్మీయ అనుబంధాన్ని చాటుతున్నారు.